Connect with us

Editorial

హిట్లర్ నాజీఇజం + ముస్సోలినీ ఫాసిజం = జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఇజం

Published

on

“పాలకులు నేరస్థులైనప్పుడు దేశభక్తులు జైళ్లలోనైనా ఉండాలి, లేదా పోరాడి మరణించాలి – ఫిడెల్ క్యాస్ట్రో”. ప్రశ్నించేతత్వం, పోరాడేతత్వం లేనిచోట బానిసత్వమే రాజ్యమేలుతుంది. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన రెండు దేశాలు, ఇద్దరు వ్యక్తులు.. ఒకటి జర్మన్, ఆ దేశాధినేత హిట్లర్. ఆయన సిద్ధాంతం నాజీయిజం. రెండోది ఇటీలీ… ఆ దేశాధినేత ముస్సోలినీ. ఆయనది ఫాసిజం. ఈ రెండు యిజాల కలయికే జగనిజం. రెండో ప్రపంచయుద్ధ కాలంలో రష్యా అధినేత స్టాలిన్ ఒక మాట చెబుతాడు. రాజ్యం ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఆర్థిక సంక్షోభాల ఫలితంగా సాంఘిక, రాజకీయ, సాంస్కృతి సంక్షోభాలుగా విస్తరిస్తున్నప్పుడు.. రాజ్యం నగ్నంగా, బహిరంగంగా, టెర్రరిస్ట్ రూపు దాలుస్తుంది. టెర్రరిస్ట్ రాజ్యం ఏర్పడి రాజ్యహింసకు పాల్పడుతుంది. ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు, ఎవరూ మాట్లాడటానికి వీల్లేదు. కనీసం ఆలోచించడానికి కూడా అవకాశం లేని చైతన్యరహిత సమాజమే ఫాసిజం సిద్ధాంతం.

ఫాసిజం భావజాల రూపాలు, వాటి భౌతిక రూపాలు ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఫాసిజం రాలేదని భ్రమపడితే అది వారి అమాయకత్వమే అవుతుంది. కేవలం తనను విమర్శిస్తున్నారన్న అక్కసుతో అర్ధరాత్రి వందల మంది పోలీసులు గోడలు దూకి వచ్చి, తలుపులు పగలగొట్టి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని, ఆయన కుమారుడును అరెస్ట్ చేయడం దారుణం. అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి మూడున్నరేళ్లుగా అయ్యన్న కుటుంబాన్ని వెంటాడుతోంది జగన్ ప్రభుత్వం. ఆయనపై ఇప్పటీకే 10 కేసులకు పైన పెట్టారు. గతంలో ఏ ప్రభుత్వమైనా బీసీల పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించిందా? అయ్యన్న పాత్రుడు ఏం నేరం చేసాడని పోలీసులు దొంగల్లా గోడలు దూకి, తలుపులు పగలగొట్టి అరెస్టు చేస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం ఆయన చేసిన నేరమా? అర్ధరాత్రి అరెస్టు చెయ్యడానికి అయ్యన్న పాత్రడు ఉగ్రవాదా? అయ్యన్నను అక్రమంగా అరెస్టు చెయ్యడం చట్ట విరుద్ధం. కోర్టులో పరిష్కరించుకొనే అంశంపై పోలీసులు ఎలా అరెస్టు చేస్తారు. మున్సిపల్ శాఖకు చెందిన సివిల్ అంశంలో సీఐడీ కి ఏం సంబంధం? ఫోర్జరీ ధ్రువ పత్రాలని దేని ఆధారంగా నిర్ధారించింది సీఐడీ?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ బంజారాహీల్స్ లో చేసిన భూ అక్రమాలను కోర్టు ద్వారా సక్రమం చేసుకోలేదా? మరి ఇడుపులపాయలో అడ్డగోలుగా ఆక్రమించుకున్న 600 ఎకరాల అసైన్డ్ భూమికి ఏం సమాధానం చెబుతారు? ఫోర్జరీ ధ్రువపత్రం అని అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేశారు. అవినీతితో మహాసామ్రాజ్యాలు నిర్మించుకొని, వేలకోట్లు ప్రజాధనం దోచుకొన్న జగన్ కి ఎన్నేళ్లు జైలు శిక్ష విధించాలి? మీకో నీతి, అయ్యన పాత్రుడుకొక నీతా? ప్రభుత్వమే ఆరోపణలు చెయ్యడం, ప్రభుత్వమే నేరనిర్ధారణకు పూనుకోవడం ఏమిటి? తనను తాను న్యాయమూర్తిగా భావించి శిక్షను ప్రకటించి అరెస్టులు చెయ్యడం ఏ రాజ్యాoగం ప్రకారం, ఏ న్యాయశాస్త్రం ప్రకారం సబబో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా అయ్యన్న పాత్రుడుని అరెస్టు చేయ్యడం దుర్మార్గం. ఆరోపణలు రాగానే ఏ వ్యక్తిని అరెస్టు చెయ్యకూడదు. అరెస్టు చేసేముందు పోలీసులు తమని తాము ప్రశ్నించుకోవాలి. ఎందుకు అరెస్టు చెయ్యాలి? ఆ వ్యక్తి మీద వచ్చిన ఆరోపణల్లో నిజముందని పోలీసులు గుర్తించినప్పుడే అరెస్టు చెయ్యాలి. వ్యక్తులను అరెస్టు చేసే విధానంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో వెల్లడించింది. కానీ మహోన్నత సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు తూట్లు పొడుస్తూ పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మూడున్నరేళ్లుగా జగన్ రెడ్డి ఆడమన్నట్లు ఆడుతూ భక్షక భటులుగా వ్యవహరిస్తున్నారు. సొంత బాబాయి హత్యవిషయంపై చెల్లెలు షర్మిళ వాస్తవాలు వెల్లడించడంతో ఆత్మరక్షణలో పడ్డ జగన్ రెడ్డి.. సమాధానం చెప్పలేక ఆ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అయ్యన్న పాత్రుడిని అర్ధరాత్రి అరెస్టు చేసి అసలు విషయం పక్కదారి పట్టిస్తున్నారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ వందలాది మందిపై దాడులు చేస్తున్నారు. ప్రభుత్వాన్నివిమర్శించిన వారిని అక్రమంగా అరెస్టు చేసి మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పై విమర్శలు చెయ్యడం, ప్రశ్నిoచడం సహజం. అంతమాత్రానా బరితెగించి ప్రతిపక్ష నాయకుల ఇళ్లను, ప్రహరీ గోడలు కూల్చడం వారి ఆస్తులు ధ్వంసం చెయ్యడం, అక్రమ కేసులు బనాయించడం వంటి చర్యలకు తెగపడతారా? ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షాన్ని వేధించడం జగన్ ప్రభుత్వానికి ఒక వికృత క్రీడగా మారింది. ఈ తరహా దమన కాండ మూడున్నరేళ్లుగా సాగుతూనే వుంది. చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారన్న కక్షతో మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడిని అక్రమంగా గోడలు దూకి ఒక దొంగని అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేశారు. శస్త్ర చికిత్స చేయించుకుని ఉన్నా.. మందులు వేసుకోవాలన్నా అనుమతించకుండా 600 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో తీసుకెళ్లి ఆసుపత్రి పాల్జేశారు. ఉన్న గాయానికి ఇన్ఫెక్షన్ సోకి మరోసారి శస్త్ర చికిత్స చేయాల్సిన దుస్థితి కల్పించారు. అచ్చెన్నాయుడిని 80 రోజులకు పైగా కస్టడీలో ఉంచి వేధించారు. తహశీల్దార్ కార్యాలయంలో ఫోటో తొలగించడాన్ని ప్రశ్నించినoదుకు మాజీమంత్రి అయ్యన్న పాత్రుడిపై ఏకంగా అట్రాసిటీ కేసులు, నిర్భయ చట్టం కింద కేసులు పెట్టి వేధించారు. ఇప్పుడు మళ్ళి ఫోర్జరీ ధ్రువపత్రం పేరుతొ అయ్యన్న పాత్రుడును అరెస్టు చేశారు.

చింతకాయల విజయ్ పైనా అక్రమ కేసులు బనాయించి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో పాటు విజయ్ కూతురుని సీఐడీ పోలీసులు కొట్టి బెదిరించారు. అనైతికమైన, అప్రజాస్వామిక విధానాలు ద్వారా అన్ని రాజ్యాంగాల వ్యవస్థలను అణగదొక్కుతున్నారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వెల్లడించిన వారిని వేధించారు. 9,600 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. నిలువెల్లా ఇంత విషం నిండిన ముఖ్యమంత్రిని ప్రపంచంలేనే ప్రజలు చూసి వుండరు. అక్రమ కేసులకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ కార్యాలయం అడ్డాగా మారింది. వాళ్లకి గాలి పోగేసి గాలి కేసులు పెట్టడం అలవాటుగా మారింది. ప్రతిపక్షాన్ని వేధించడమే లక్ష్యoగా పని చేస్తుంది సీఐడీ. వారు పెడుతున్న కేసులన్నిటిలో కోర్టుల్లో భంగపాటు ఎదురవుతున్నా, కోర్టులు చీవాట్లు పెడుతున్నా సీఐడీ తీరు మారడంలేదు. వైసీపీ నాయకులు అధికారం ఉందని మిడిసిపడుతున్నారు. మాకు ఎదురులేదు, తిరుగులేదు అని విర్రవీగిన వారు కాలగర్భంలో కలిసిపోయిన వాస్తవాలు గుర్తించాలి. అవినీతి బురదలో పొర్లి జైలు జీవితం గడిపిన వారు తనకంటిన అవినీతి బురదని తెలుగుదేశం నాయకులకు పులిమి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అధికారంలో వున్నాం ఏదైనా చేస్తాం అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న సమస్త విధానాలు అన్ని అప్రజాస్వామిక మైనవే కాదు.. అనాలోచితమైనవి, అసంబద్దమైనవి, నిరంకుశమైనవి. కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి వేధించడం, వ్యక్తిగత ఆస్తులు ధ్వంసం, దాడులు చెయ్యడం, సీఐడీ పోలీసులతో అక్రమ కేసులు పెట్టడం తారాస్థాయికి చేరింది. ఇండియన్స్ పీనల్ కోడ్ [IPC] ని వైసీపీ పీనల్ కోడ్ గా మార్చారు. జగన్ అసమర్ధ పాలనతో రాష్ట్ర ప్రతిష్ట మసక బారింది. రాష్ట్ర వ్యాప్తంగా తన పరిపాలన పట్ల పెరుగుతున్న వ్యతిరేకత పట్ల జగన్ కళ్ళల్లో, ఆయన శిబిరంలో కలవరం మొదలైంది. తన ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దపడుతున్నారన్న విషయం గ్రహించిన జగన్ లో అక్కసు, అసహనం పెరిగిపోతున్నాయి. నిరాశా, నిస్పృహ అలుముకుంటున్నాయి. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన పాపం నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు, ప్రజల కళ్ళకు గంతలు కట్టేందుకు ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నది. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈ విధమైన కక్ష సాధింపులతో ప్రజలపై ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి వ్యవహరించలేదు. ఈ తరహా విధ్వంసం, కక్ష సాధింపులు కొనసాగించినంత కాలం జగన్ కి రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉండదని గుర్తించాలి.

– మన్నవ సుబ్బారావు, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected