డాలస్, టెక్సస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో డాలస్ (Dallas, Texas) లో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో 350కి పైగా ప్రవాస భారతీయులు పాల్గొని విజయవంతం చేశారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ (Mahatma Gandhi Memorial of North Texas) కార్యదర్శి రావు కల్వల (Rao Kalvala) మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు సైతం నిత్యం యోగా, ధ్యానం చేసేవారని, అలాంటి గాంధీ విగ్రహం ముందు ఈ యోగా దినోత్సవం జరుపుకోవడం సంతోషం అని అతిథులకు సాదర స్వాగతం పలికారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా గౌరవ డి.సి మంజునాథ్ తన సందేశంలో – అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Day of Yoga) 2014లో ఐక్యరాజ్యసమితి స్థాపించింది. భారతదేశ గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (Narendra Modi) చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇవ్వడంతో ఈ తీర్మానం ఆమోదించబడింది.
2015లో మొదటి యోగా దినోత్సవం నిర్వహించినప్పటినుండి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ జూన్ 21న యోగాలో పాల్గొంటున్నారు. క్రీస్తు పూర్వం 2 వ శతాబ్దంలోనే పతంజలి మహర్షి ఈ యోగ (Yoga) సూత్రాలను భారతదేశంనుండి ప్రపంచానికి అందించిన ఒక గొప్ప బహుమతి అన్నారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) మాట్లాడుతూ – “యోగా అనే పదానికి అర్థం – ఐక్యత. ఇది శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య ఉన్న అనుసంధానాన్ని సూచిస్తుంది. యోగా సాధన చేయడం వల్ల శరీర సౌలభ్యం, బలం, సరైన భంగిమ మరియు శ్వాస నియంత్రణ మెరుగుపడతాయి.
అలాగే, నేటి వేగవంతమైన ప్రపంచంలో సాధారణంగా ఎదురయ్యే మానసిక ఒత్తిడులను మరియు ఆందోళనలను తగ్గించడంలో కూడా ఇది (Yoga) సహాయపడుతుంది. నిత్య యోగాసాధన ఆరోగ్యకరమైన కుటుంబాలు, బలమైన సమాజం, మరియు శాంతియుతమైన ప్రపంచాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Day of Yoga) కేవలం ఒక రోజు జరుపుకునే వేడుక మాత్రమే కాదు. ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు మరియు జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందామని మనం సంకల్పిద్దాం” అన్నారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ (Mahatma Gandhi Memorial of North Texas) కో-ఛైర్మన్ మహేంద్ర రావు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలగా ఈ గాంధీ మెమోరియల్ వద్ద క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఏటా పాల్గొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని, అన్ని వయస్సులవారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంచేసిన వారందరికీ కృతజ్ఞతలు అన్నారు.
‘హార్ట్ ఫుల్నెస్’ సంస్థ (Heartfulness Meditation) సహకారంతో, సురేఖ కోయా బృందం నిర్వహణలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో గంటన్నరకు పైగా సాగిన యోగా, ధ్యానం శిక్షణ అందరినీ మెప్పించింది. ఈ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ మహాత్మాగాంధీ (Mahatma Gandhi) మెమోరియల్ కో ఛైర్మన్ తైయబ్ కుండావాల కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Day of Yoga) కార్యక్రమంలో బోర్డ్ సభ్యులు దీపక్ కల్రా, మురళి వెన్నం (Murali Vennam), తైయబ్ కుండావాల, కళ కృష్ణమూర్తి, హరీష్ నేహతే, అనంత్ మల్లవరపు (Ananth Mallavarapu), వినోద్ ఉప్పు లతో సహా అనేక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.