Milpitas, California: శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న విశాఖ (Vizag) రీజియన్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విశాఖ ఎంపీ ముతుకుమిల్లి శ్రీభరత్ ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనకు వెళ్లిన శ్రీభరత్ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం ఆధ్వర్యాన నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు గ్రోత్ ఇంజన్ విశాఖపట్నం (Vizag), సీఎం చంద్రబాబు (Nara Chandrababu Naidu) గారి సారథ్యంలో ట్రిలియన్ డాలర్ ఎకానమీ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో పాటు ప్రస్తుతం ఏపీలో పరిశ్రమదారులకు దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు.
మంత్రి లోకేష్ (Nara Lokesh) చొరవతో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రధాన సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి, గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి ప్రధాన సంస్థలు ఇప్పటికే పనులు ప్రారంభించాయి. జులై మొదటివారంలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కాబోతోంది. ప్రవాసాంధ్ర పెట్టుబడిదారులకు ఇదే మంచి తరుణమని అన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25శాతానికి పైగా ఏపీకి వస్తున్నాయని చెప్పారు. పరిశ్రమలకు అన్నివిధాలా అనుకూలతలు కలిగిన విశాఖలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం వహించాల్సిందిగా ఎంపీ శ్రీభరత్ (Bharat Mathukumilli) విజ్ఞప్తి చేశారు. ప్రవాసాంధ్రులకు అన్నివిధాల సహాయ, సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో NRI TDP USA నాయకులు వెంకట్ కోగంటి (Venkat Koganti), శ్రీకాంత్ దొడ్డపనేని, భక్త భల్లా, శ్రీనివాసు తడపనేని, విజయ్ గుమ్మడి, బిర్యానీ జంక్షన్ వెంకట్, రాజశేఖర్ పర్వతనేని, జగదీష్ గింజుపల్లి, విజయ్ రెడ్డి జెట్టి. శ్రీనివాస్ వట్టికూటి, మోహన్ మల్లెంపాటి, భరత్ ముప్పిరాల, రామ్ తోట, నరేందర్ రెడ్డి యెన్నంరెడ్డి, సుధీర్ ఉన్నం, హరి సన్నిధి, విజయ్ ఆసూరి, శశి దొప్పలపూడి, కిశోరె తాడికొండ తదితరులు పాల్గొన్నారు.