Philadelphia: ఫిలడల్ఫియా నగరంలో 26.04.2026 వ తేదిన ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం ను సత్కరించేందుకు ఆత్మీయ సమావేశం జరిగింది. పద్మభూషణ్ (Padma Bhushan) డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ముఖ్య అతితిగా పాల్గొన్నఈ కార్యక్రమాన్ని రవి పొట్లూరి సమన్వయపరిచారు. పెద్దసంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నోరి దత్తాత్రేయుడు (Dr. DattatreyuduNori) మాట్లాడుతూ… నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ తెలుగుజాతి ఔన్నత్యాన్ని అమెరికాలో జయరాం నిలబెట్టారని కొనియాడారు. నాకు చిన్నతనం నుంచి ఎన్టీఆర్ (NTR) అంటే అభిమానం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం సలహా మేరకే హైదరాబాద్ లో క్యాన్సర్ ఆసుపత్రికి బీజం పడింది.
ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలతో గత ఐదు దశాబ్దాలుగా సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నాను. ఈ విషయాన్ని అనేకసార్లు చంద్రబాబు (Nara Chandrababu Naidu) గుర్తు చేస్తుండేవారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఆహార అలవాట్లను మార్చుకోవడం ద్వారా ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను నివారించవచ్చని, ప్రజలకు అవగాహన కల్పిస్తే ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను నివారించవచ్చని తెలిపారు.
జయరాం కోమటి (Jayaram Komati) మాట్లాడుతూ… ప్రవాసాంధ్రుల్లో నేను ఒకడిగా ఉన్నందుకే నాకు ఈ అవకాశం లభించింది. చంద్రబాబు నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) సాంకేతిక విద్యను అందించడానికి ప్రవాసులుగా జన్మభూమి రుణం తీర్చుకుందామని పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గుగూల్ డేటా సెంటర్ (Google Data Center) లాంటి సంస్థలు ఏపీకి రావడం జరిగింది. సాంకేతిక విద్యను అందిస్తే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం కోమటి జయరాంను, నోరి దత్తాత్రేయను ఘనంగా సత్కరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Muppavarapu Venkaiah Naidu), సుప్రీం కోర్టు మాజీ ఛీఫ్ జస్టీస్ ఎన్. వీ. రమణ (NV Ramana) లు ఇచ్చిన సందేశాన్ని ఏవీ ద్వారా ప్రదర్శించారు.