Connect with us

Language

NATS: సొగసైన తెలుగు భాషా మాధుర్యంపై సదస్సు – GV Purnachandu

Published

on

భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నాట్స్ నినాదానికి తగ్గట్టుగా నాట్స్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తెలుగు భాష గొప్పతనాన్ని, వైభవాన్ని నేటి తరానికి కూడా తెలియచేయడానికి అంతర్జాల వేదికగా నాట్స్ సొగసైన తెలుగు భాష పేరిట సదస్సు నిర్వహించింది.

నాట్స్ లలిత కళా వేదిక, న్యూ జెర్సీ లోని స్థానిక తెలుగు కళా సమితి సంయుక్తంగా నిర్వహించిన ఈ వెబినార్‌కు అమెరికాలో తెలుగు వారి నుంచి విశేష స్పందన లభించింది. సొగసైన తెలుగు వెబినార్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత జీవీ పూర్ణచందు తెలుగుభాషలో మాధుర్యం ఎంత గొప్పదనేది చక్కగా వివరించారు.

తెలుగువారు మరిచిపోయిన, వాడుకలో లేని పదాలను ఈ సదస్సులో గుర్తుచేశారు. ఆ పదాలను ఏయే సందర్భాల్లో ఎలా వాడాలనేది కూడా చక్కగా వివరించారు. ఒక్కో పదం అర్థం, అందులోని పరమార్థం విడమరిచి చెప్పడంతో సదస్సుకు హాజరైన తెలుగువారు జీవీ పూర్ణచందుపై ప్రశంసల వర్షం కురిపించారు.

నాట్స్ తెలుగు భాష కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని దానిలో భాగంగానే నాట్స్ లలిత కళా వేదిక ఏర్పాటు చేశామని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి తెలిపారు. తెలుగు భాషా వైభవానికి నాట్స్ తన వంతు కృషి చేస్తుందన్నారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు.

సొగసైన భాష వెబినార్‌కు వ్యాఖ్యాతలుగా నాట్స్ నాయకులు గిరి కంభంమెట్టు, సాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ లు వ్యవహరించారు. తెలుగు భాష కోసం నాట్స్ చేపడుతున్న కార్యక్రమాల గురించి నాట్స్ కార్యనిర్వాహక కార్యదర్శి (మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల వివరించారు.

తెలుగు సాహిత్యం, కళలకు సంబంధించిన ఏ కార్యక్రమానికైనా తమ మద్దతు ఉంటుందని తెలుగు కళా సమితి అధ్యక్షుడు మధు రాచకుళ్ల తెలిపారు. అంతర్జాలం ద్వారా చాలా మంది తెలుగువారు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. సొగసైన తెలుగు భాష వెబినార్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ ఉమన్ అరుణ గంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected