శ్రీ సాంస్కృతిక కళాసారథి (Sri Samskrutika Kalasaradhi, Singapore) సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖామంత్రి వర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ (Satya Kumar Yadav) తో ముఖాముఖీ కార్యక్రమం ఆదివారం నాడు సెంగ్కాంగ్లోని లా ఫియెస్టా కాండోమినియంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ సత్య కుమార్ (Satya Kumar Yadav) కి సంస్థ సభ్యులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ (Ratna Kumar Kavuturu) మాట్లాడుతూ, తమ బిజీ షెడ్యూల్ మధ్యలో ప్రవాస తెలుగు వారి కోసం సమయం కేటాయించినందుకు మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం ఆరు గంటల ముందే ఈ కార్యక్రమాన్ని ప్రణాళిక చేసినప్పటికీ, 50 మందికి పైగా హాజరుకావడం నిర్వాహకులకు ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
తదుపరి మంత్రి శ్రీ సత్య కుమార్ (Satya Kumar Yadav) మాట్లాడుతూ, సింగపూర్ (Singapore) లో తన అధ్యయన పర్యటన సందర్భంగా ప్రవాస తెలుగు సభ్యులతో కలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (Narendra Modi) “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
గత దశాబ్దంలో భారతదేశం (India) సాధించిన అభివృద్ధిని వివరిస్తూ — ‘ఫ్రాజైల్ ఫైవ్’ ఆర్థిక వ్యవస్థ నుండి ప్రపంచంలోని టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదగడం, దిగుమతులపై ఆధారపడే దేశం నుండి ఎగుమతుల్లో శక్తివంతమైన దేశంగా మారడం, సంక్షోభాలను ఎదుర్కొనే స్థితి నుండి అవకాశాలను సృష్టించే స్థితికి చేరడం వంటి అంశాలను వివరించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ భారతదేశ దృష్టి, పురోగతి, ఆకాంక్షలతో ఉన్న బలమైన అనుబంధాన్ని ఈ అనుభవం ప్రతిబింబిస్తుందని తెలిపారు.
భారత ఆర్థిక పరివర్తనపై సమగ్రంగా వివరిస్తూ:
- GDP వృద్ధి రేటు 4.4% నుండి 7–8%కు పెరిగినట్లు తెలిపారు
- స్టార్టప్ ఎకోసిస్టమ్ 50 నుండి 15 లక్షలకు విస్తరించి, 125 యూనికార్న్లు ఏర్పడ్డాయని పేర్కొన్నారు
- ద్రవ్యోల్బణం 2% లోపలికి తగ్గినట్లు వివరించారు
- పునరుత్పాదక శక్తి రంగంలో 200 గిగావాట్ల ఉత్పత్తి సాధించామని, 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధి విషయమై కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం (Vizag), తిరుపతి, కాకినాడ వంటి నగరాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని వివరించారు. కార్యక్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రాంబాబు పాతూరి, చామిరాజు రామాంజనేయులు పాల్గొన్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్ నిట్టల, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షుడు రంగా రవికుమార్, సీనియర్ సభ్యులు గుత్తుల రవికుమార్, వేణు మల్లవరపు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం కోసం మంత్రి సత్యకుమార్ గారితో సమన్వయం చేసిన సింగపూర్ (Singapore) తెలుగు సమాజం మాజీ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమానికి సహకరించిన దాములూరి భరత్, వెంకట్ భీమినేని, యోగి బూరుగపల్లి, సాంకేతిక సహాయం అందించిన రాధాకృష్ణ గణేశ్న కి, భోజన ఏర్పాట్లు చేసిన సరిగమ రెస్టారెంట్ (Sarigama Grand Restaurant & Bistro) యజమాని సురేంద్ర చేబ్రోలు కి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.