Connect with us

Literary

వైభవంగా అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ వేడుకలు: తానా ప్రపంచ సాహిత్య వేదిక

Published

on

ఫిబ్రవరి 21, అట్లాంటా: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” సందర్భంగా సోమవారం, ఫిబ్రవరి 21, 2022న భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 కు అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాల దృశ్య సమావేశం వైభవంగా జరిగింది. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలుగు భాషా వైభవాన్ని వివరిస్తూ, పర దేశంలో ఉంటూనే మాతృభాషను పరిరక్షించి పరివ్యాప్తం చేయడం లో తానా చేస్తున్న కృషిని వివరించి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిదులందరికీ ఆహ్వానం పలికారు. ముందుగా ఇటీవలే మృతిచెందిన ఆంధ్ర ప్రదేశ్ ఐటి, పరిశ్రమల శాఖామాత్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి మరియు ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత నాగళ్ల గురుప్రసాద రావుల మృతి పట్ల తానా సంస్థ తరపున తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర వారికి శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేసి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా. కంభంపాటి హరి బాబు గార్ని సభకు పరిచయం చేసి ఆహ్వానం పలికారు.

గవర్నర్ డా. కంభంపాటి హరి బాబు మాట్లాడుతూ మాతృదేశానికి ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉంటూ కూడా ‘నెల నెలా తెలుగు వెన్నెల’ పేరిట తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా వివిధ సాహిత్య సదస్సులు నిర్వహిస్తూ ఇప్పుడు 32 వ సమావేశం జరుపుకుంటున్న తానా సంస్థకు అభినందనలు తెలియజేశారు. భారత రాజ్యాంగం లోని 53 వ అధికరణం ప్రకారం ప్రాధమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాభోధన జరగాలి, కేంద్రప్రభుత్వ 2020 నూతన విద్యావిధానం అనుసరించి కనీసం 5 వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధనతో పాటు ఇంజనీరింగ్ లాంటి వృత్తి విద్యలలో కూడా మాతృభాషలో విద్యాబోధన జరిగేటట్లు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మాతృభాషాభిమానం కల్గి ప్రతి ఒక్కరూ మన తెలుగు భాషను నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రతి ఏటా ఫిబ్రవరి 2 1 వ తేదిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడానికి కారణం అప్పటి తూర్పు పాకిస్తాన్, ఇప్పటి బంగ్లాదేశ్ లో అత్యధికంగా బెంగాలీ భాష మాట్లాడే ప్రజలపై అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూ భాషను జాతీయ భాష గా బలవంతంగా రుద్దినప్పుడు అక్కడి బెంగాలీలు తీవ్ర నిరసన తెలియజేస్తూ సాగించిన మహోద్యమంలో ఫిబ్రవరి 21, 1952 లో ఎంతో మంది మరణించడం, కొన్ని వందలమంది తీవ్రంగా గాయపడిన విషాదకర సంఘటనలను ఐక్యరాజ్యసమితి గుర్తించి 2000 సంవత్సరం నుండి ఏటా ఫిబ్రవరి 21 ని అన్ని దేశాలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది” అని అన్నారు.

గౌరవ అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ పిల్లంగోల్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ అంగ్ల భాష ఎంతో అవసరం అయినప్పటికీ దాని మోజులో పడి మన మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదని, ఒక విషయాన్ని మనం మాతృభాషలో అర్ధం చేసుకున్న వివరంగా ఇతర భాషల్లో అర్ధం చేసుకోలేమని, పరిపాలనా భాష గా కూడా తెలుగు విస్తరించ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. మరో గౌరవ అతిధిగా పాల్గొన్న మిజోరాం కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.ఆర్.ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ మిజోరాం రాష్ట్రం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం తో కూడుకుని ఉన్న, అక్షరాస్యతలో అగ్రస్థానం లో ఉన్న రాష్ట్రం అని, చాలా తక్కువమంది తెలుగు వారు ఉన్నప్పటికీ వివిధ రంగాల్లో మంచి ఖ్యాతి గడిస్తున్నారని, మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాల సహకారంతో శరవేగంతో ప్రగతి పధంలో మిజోరాం దూసుకుపోతుందని అన్నారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన ఈ “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ” వేడుకల్లో వివిధ రాష్ట్రాలనుండి తెలుగు ప్రముఖులు పాల్గొని ఆయా రాష్ట్రాలలో తెలుగు వారి సంఖ్య, తెలుగు భాషను నిలబెట్టుకోవడానికి వారు చేస్తున్న కృషి, వివిధ హోదాలలో పనిచేస్తూ తెలుగు ఖ్యాతిని నిలబెడుతూన్న అధికార, అనధికార ప్రముఖులు, తెలుగు సంఘాల పాత్ర, తెలుగు రచయితలు యిత్యాది అంశాలపై అత్యద్భుతంగా సమగ్ర విశ్లేషణ చేశారు. వీరిలో ..
శ్రీ దాట్ల దేవదానం రాజు, పుదుచ్చేరి (యానాం)
ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, తమిళనాడు
శ్రీ యజ్ఞ నారాయణ, కేరళ
శ్రీ విజయభాస్కరరెడ్డి, మహారాష్ట్ర
డా. తుర్లపాటి రాజేశ్వరి, ఒడిశా
శ్రీ లండ రుద్రమూర్తి, ఛత్తీస్ గడ్
శ్రీ రాపోలు బుచ్చిరాములు, గుజరాత్
శ్రీ వింజమూరి బాలమురళి, పశ్చిమ బెంగాల్
ఆచార్య యన్. లక్ష్మి అయ్యర్, రాజస్తాన్
శ్రీమతి కమలాకర రాజేశ్వరి, న్యూ ఢిల్లీ నుండి పాల్గొన్నారు.

పాల్గొన్న ముఖ్య అతిధి, గౌరవ అతిధులకు, విశిష్ఠ అతిధులకు, సహకారం అందిస్తున్న ప్రసార మాధ్యమాలకు డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలను తెలియజేస్తూ ఫిబ్రవరి 27 న “తెలుగు తల్లికి పద్యాభిషేకం” అనే సాహిత్య కార్యక్రమం అంతర్జాల దృశ్య సమావేశం జరుగుతుందని తెలియ జేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected