Singapore: సింగపూర్లోని భారత హై కమిషన్ (High Commission of India) లో పాస్పోర్ట్ ఆఫీసర్ గా సేవలందించి బదిలీపై స్వదేశానికి వెళ్తున్న వై.ఎస్.వి.ఎస్. ఆర్. కృష్ణ కి, శ్రీ సాంస్కృతిక కళాసారథి (సింగపూర్) సంస్థ ఆధ్వర్యంలో ఘనమైన ఆత్మీయ సమ్మేళనం మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది.
దాదాపు 50 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ (Ratna Kumar Kavuturu) మాట్లాడుతూ, కృష్ణ సింగపూర్ (Singapore) లోని తెలుగు వారందరికి ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో, అందించిన సహాయం మరియు సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
పాస్పోర్ట్ (Passport) సంబంధిత సమస్యలు మాత్రమే కాకుండా, భారత హై కమిషన్ (High Commission of India) కు సంబంధించిన అనేక అంశాలలో ఆయన అందించిన మార్గదర్శకత్వం, సహకారం ఎంతో మందికి ఉపయోగపడిందన్నారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని, సమయం సందర్భం చూడకుండా స్పందించి సహాయం చేయడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు.
గత మూడున్నర సంవత్సరాలుగా వ్యక్తిగతంగా మరియు శ్రీ సాంస్కృతిక కళాసారథి (Sri Samskrutika Kalasaradhi) సంస్థ ద్వారా కృష్ణ తో ఏర్పడిన ఆత్మీయ అనుబంధం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఆయన బదిలీ సింగపూర్ తెలుగు సమాజానికి ఒక లోటుగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.
అనంతరం కృష్ణ మాట్లాడుతూ, వారాంతమైన ఆదివారం రోజున ఇంతమంది తెలుగు సోదరులు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసి తనను సత్కరించడం హృదయాన్ని హత్తుకుందని అన్నారు. సింగపూర్ (Singapore) లో గడిపిన ఈ కాలం తన జీవితంలో ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని, ఇంతమంది తెలుగు వారి అభిమానాన్ని పొందడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
కోవిడ్ (COVID-19) అనంతర కాలంలో సింగపూర్లో బాధ్యతలు స్వీకరించినప్పుడు అనేక అత్యవసర మరియు క్లిష్టమైన కేసులు ఎదురయ్యాయని, వారాంతాలు లేదా కార్యాలయ సమయాలు అనే పరిమితులు లేకుండా వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేశానని తెలిపారు. కొన్ని క్లిష్టమైన కేసులను ఎలా పరిష్కరించారో ఉదాహరణలతో వివరించారు.
సింగపూర్ (Singapore) లోని తెలుగు వారందిరితో తనకు ఏర్పడిన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, వివిధ తెలుగు సంస్థలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. భారతీయులు మాత్రమే కాకుండా, సింగపూర్ పౌరసత్వం పొందిన భారతీయ (India) మూలాల ప్రజలు భారతదేశానికి వెళ్లే సందర్భంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో సంస్థ సభ్యులు రాంబాబు పాతూరి, చామిరాజు రామాంజనేయులు, సుధాకర్ జొన్నాదుల, శ్రీధర్ భరద్వాజ్, సుబ్బు వి. పాలకుర్తి పాల్గొన్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ కుమారుడు కె. నాగేంద్ర తో పాటు సింగపూర్కు చెందిన పలువురు తెలుగు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అలాగే ఈ ఆత్మీయ సమ్మేళనం మరియు సన్మాన కార్యక్రమ విజయవంతానికి సహకరించిన సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ (Sarigama Grand Restaurant & Bistro) యజమాని సురేంద్ర చేబ్రోలు, మనోహర్ ఇంటూరి, మోహన్ నూకల లకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.