Connect with us

Literary

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ‘టాంటెక్స్’ ఆధ్వర్యంలో 178వ సాహితీ సదస్సు

Published

on

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 8న జరిగిన 178 వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన అంతర్జాలంలో సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు నమస్కారములు తెలిపారు. చిన్నారులు సింధు, సాహితీ ”పలుకే బంగారమాయెనా కోదండపాణీ పలుకే బంగారమాయెనా ”అంటూ తమ మధుర గాత్రంతో వీనుల విందుగా పాడి సాహితీ ప్రియులను పరవశింప చేశారు. ఉత్తరటెక్సస్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న ప్రతి సాహితీ సదస్సుకూ వారి నోటపాట విన్పించేలా సహకరిస్తున్న శ్రీమతి కిరణ్మయి, లెనిన్ దంపతులు అభినందనీయులు.

ప్రముఖ సాహితీ విశ్లేషకులు శ్రీ లెనిన్ వేముల గారు తమ గురువుగారయిన వాణీ కుమారి గారు ఎంచుకున్న మయూర సూర్య శతకంలోని మనసును రంజింపచేసే కొన్ని పద్యాలు వాటి విశిష్టతను సోదాహరణముగా వివరించి తమ పాండిత్య ప్రతిభను చాటుకొన్నారు. విశ్వనాధ సత్యనారాయణ గారి వద్ద శిష్యరికం చేసి ప్రతిభావంతులైన హరనాధ్ గారు ముఖ్య అతిధి వాణీ కుమారి గారి ప్రతిభను కొనియాడారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం 177వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ముఖ్య అతిథి డాక్టర్ తుమ్మలపల్లి వాణీ కుమారిగారు” సూర్య శతకంలో రమణీయ వర్ణనలు”అనే శీర్షికన అద్భుతమైన ప్రసంగము చేశారు. హర్షవర్ధనుని ఆస్థాన కవి బాణభట్టుకి బంధువు సమకాలీకుడైన మయూరుడు తనకు వచ్చిన కుష్ఠువ్యాధిని నయము చేసుకొనడానికి భాస్కరుణ్ణి ఆరాధించడం తప్ప వేరే మార్గము లేదని నమ్మి సూర్యుని పై భక్తితో రచించిన మయూర సూర్యశతకములోని కొన్ని ఆణి ముత్యములవంటి పద్యములను చదివి భావార్థసహితముగా వ్యాఖ్యానము చేసి తన అద్భుతమైన ప్రసంగముతో సభికులను ఆకట్టుకున్నారు.

ప్రతి నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో సత్యం ఉపద్రష్ట గారు, రాధ కాశీనాధుని గారు కలిసి పద్య సౌగంధం శీర్షిక నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. డాక్టర్ ఉపద్రష్ట సత్యం గారు కమనీయమైన పద్యాల్ని చదివి సందర్భ సహిత వ్యాఖ్యతో సహా భావార్ధాలను సులభరీతిలో వివరించి పద్య కుసుమ సౌరభాలను వెదజల్లినారు . ఆధునిక సహజ పండితులు డా. ఊరుమిండి నరసింహారెడ్డి గారు తాము 2018 నుండి నేటి వరకు సభకు హాజరవుతున్న వారినందరినీ భాగస్వాములను చేయాలన్న సత్సంకల్పముతో నెల నెలా నిర్వహిస్తున్న “మన తెలుగు సిరిసంపదలు” కార్యక్రమములో పొడుపుకథల మిళితమైన పద్యాలు చమత్కార గర్భితమైన శ్లోకాలు. పదభ్రమకాలు సోదాహరణముగా చెప్తూ సాహితీ ప్రియులకు రెండక్షరాల పద భ్రమకాలు.మూడక్షరాల పదభ్రమకాలు ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులను తీవ్రముగా ఆలోచింపచేసి వారినుండి సరియైన పద భ్రమక సమాధానాలను రాబట్టే ప్రయోగం కొనసాగించారు. హాజరైన వారందరి మెదడుకు మేత వేసి సాహితీ ప్రియులలో ఉత్సాహాన్ని నింపి అందరి ప్రశంసలనందుకొన్నారు.

నేటి ”మాసానికో మహ నీయుడు” శీర్షిక క్రింద మే నెలలో జయంతి మరియు వర్ధంతి జరుపుకొంటున్న ప్రముఖ కవుల వివరాల్ని అధిక శ్రమకోర్చి సేకరించి ఆయా రచయితలను గుర్తుచేయడమే గాక ప్రముఖ కవులు బూదరాజు రాధాకృష్ణ గారు మరియు చలంగారి జీవిత విశేషాల్ని వారు వ్రాసిన రచనల్ని సవివరముగా వివరించిన డా. అరుణజ్యోతి కోలాగారి కృషి ప్రసంశనీయం. అంతర్జాతీయ మాతృదినోత్సం సందర్భంగా డా. అరుణజ్యోతి కోలా గారు మరియు శ్రీ గోవర్ధనరావు నిడిగంటి నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ తమ తల్లికి రుణపడివున్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. గోవర్ధనరావు గారు మాతృదినోత్సవం సందర్భంగా చిన్ని కృష్ణుడి తల్లి యశోద ప్రేమను వివరిస్తూ చక్కగా పాడి వినిపించారు.

సంస్థ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ ఉమామహేష్ పార్నపల్లి గారు మాట్లాడుతూ మే 15న నిర్వహించనున్న మణిశర్మ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్: టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు గురించి తెలిపి పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతము చెయ్యాలని విన్నపము చేశారు. సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారు సభలోని సన్నివేశాలను ఎప్పటిలాగే తన కెమెరాలో బంధించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన గారు ముఖ్య అతిథి డాక్టర్ తుమ్మలపల్లి వాణీ కుమారి గారికి జ్ఞాపికను బహుకరించారు. ప్రార్థనా గీతం పాడిన సాహితీ మరియు సింధూతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ ఉమామహేష్ పార్నపల్లి గారు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected