గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన ఘన విజయంతో సిలికానాంధ్ర మనబడి 2026–2027 విద్యా సంవత్సరాన్ని చారిత్రాత్మకంగా ప్రారంభించింది. ఆగస్టు 1న మాతృసంస్థ సిలికానాంధ్ర 25వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన అతిపెద్ద తెలుగు పద్య సమూహ పారాయణం ద్వారా కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పడంలో మనబడి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, గురువులు, సమన్వయకర్తలు కీలక పాత్ర పోషించారు.
ఈ చారిత్రాత్మక పద్య పారాయణంలో 1712 మంది పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. వీరిలో ఎంతో మంది మనబడి ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులే. వారు సుమతీ శతకం మరియు వేమన శతకం నుండి ఎంపిక చేసిన 18 పద్యాలను ఏకకాలంలో కంఠస్థ పారాయణం చేసి, తమ తెలుగు భాషా ప్రావీణ్యాన్ని మాత్రమే కాకుండా తెలుగు సాహిత్యం, సంస్కృతిపై తమకున్న గాఢమైన అనుబంధాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.
ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి డీన్ రాజు చమర్తి (Raju Chamarthi) మాట్లాడుతూ, “గిన్నిస్ ప్రపంచ రికార్డు వేదికపై 1712 మంది కలిసి తెలుగు పద్యాలను పారాయణం చేయడం చూడటం మనబడి ఎన్నేళ్లుగా సాధించిన విజయాలకు సజీవ నిదర్శనం. ఆ వేదికపై గర్వంగా నిలిచిన వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు, పూర్వ విద్యార్థుల ప్రయాణం ఒక మనబడి తరగతి గదిలోనే ప్రారంభమైంది.
అదే గర్వాన్ని రాబోయే తరాలు కూడా అనుభవించాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్న ప్రతి అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు అమెరికాలో (USA) ఉంటున్న తమ పిల్లలకు చెప్పి, మనవలు-మనవరాళ్లను తప్పనిసరిగా మనబడిలో మాతృభాషను నేర్చుకునేలా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అన్నారు.
వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (WASC) గుర్తింపు పొందిన ప్రపంచంలోని ఏకైక తెలుగు విద్యాసంస్థగా సిలికానాంధ్ర మనబడి విశిష్ట స్థానం సంపాదించింది. స్థాపన నుండి ఇప్పటివరకు 1,10,000 మందికి పైగా పిల్లలకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం నేర్పడమే కాకుండా, తమ మాతృభాష, సంస్కృతిపై గర్వాన్ని పెంపొందించింది.
మనబడి పాఠ్య ప్రణాళిక చిన్నారుల ప్రారంభ దశ నుంచే ఉన్నత స్థాయి భాషా ప్రావీణ్యం సాధించేలా శాస్త్రీయంగా రూపొందించబడింది. విద్యార్థులు బాలబడి–1, బాలబడి–2తో ప్రారంభించి, అనంతరం ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం స్థాయిలను అభ్యసిస్తారు. తెలుగు (Telugu) భాషా, సాహిత్యాలలో మరింత లోతైన పాండిత్యం కోరుకునే విద్యార్థుల కోసం ప్రబోధం అనే ఐచ్ఛిక ఉన్నత స్థాయి కోర్సు కూడా అందుబాటులో ఉంది.
తరగతి గది బోధనకు తోడుగా, సిలికానాంధ్ర రూపొందించిన వినూత్న బాలరంజని అభ్యాస సహాయక యాప్ విద్యార్థులకు అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో ఇంటరాక్టివ్ కార్యకలాపాల ద్వారా పాఠాలను పునశ్చరణ చేసుకోవచ్చు. దీంతో తరగతి గదిలోనూ, ఇంట్లోనూ తెలుగు (Telugu) అభ్యాసం మరింత ఆసక్తికరంగా, ప్రభావవంతంగా మారుతుంది.
భాషా బోధనతో పాటు, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని మనబడి బాలానందం, తెలుగు మాట్లాట, తెలుగుకి పరుగు, బాలరంజని, మనతరం వంటి అనేక పాఠ్యేతర కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వీటి ద్వారా విద్యార్థుల్లో వక్తృత్వ నైపుణ్యం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, బృందస్ఫూర్తి పెంపొందడంతో పాటు తెలుగు భాష, సంస్కృతిపై జీవితాంతం నిలిచే అభిమానం పెరుగుతుంది.
2026–2027 విద్యా సంవత్సరానికి సిలికానాంధ్ర మనబడి (Silicon Andhra Manabadi) నమోదు కార్యక్రమం లభ్యం. అమెరికా (US), కెనడా (Canada) దేశాలలోని 250కు పైగా కేంద్రాల్లో సెప్టెంబర్ 2026 మొదటి వారాంతంలో తరగతులు ప్రారంభమవుతాయి.