ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao – NTR) 102వ పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని జార్జియా రాష్ట్రం, కమ్మింగ్(Cumming, Georgia) మహానగరంలో ఘనంగా నిర్వహించారు.
మే 28 బుధవారం రోజున కమ్మింగ్ (Cumming, Georgia) లోని సానీ మౌంటైన్ ఫార్మ్స్ (Sawnee Mountain Farms) ఎన్టీఆర్ విగ్రహ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 250 మంది ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వ్యాఖ్యాత లావణ్య గూడూరు (Lavanya Guduru) అందరికీ స్వాగతం పలికి ఆసీనులవ్వవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా రవి పోణంగి, కోటేశ్వరరావు కందిమళ్ల వంటి ప్రముఖులు తదితరులు ప్రసంగించారు.
అనంతరం అందరూ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని తెలియజేశారు. పలువురు ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao – NTR) విగ్రహం వద్ద ఫోటోలు దిగుతూ ఆహ్లాదంగా గడిపారు. వీక్ డే అయినప్పటికీ ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.
జై ఎన్టీఆర్..జై జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) స్థాపించినటువంటి పరిస్థితులు, ప్రభుత్వ పరంగా పేదల కోసం తీసుకువచ్చిన పథకాలు, ఎన్టీఆర్ సినీవిశేషాలు వంటి విషయాలను నెమరువేసుకున్నారు.
ముందు రోజు వరకు వర్షం పడుతున్నప్పటికీ ఈ కార్యక్రమ నిర్వహణ సమయంలో ఆ వరుణుడు కూడా తెరపి ఇవ్వడం కొసమెరుపు. చివరిగా భోజనానంతరం వందన సమర్పణతో నందమూరి తారక రామారావు (NTR) 102వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ముగిశాయి.
అలాగే రెడ్ చిల్లీస్ ఇండియన్ క్యుజైన్, వేడుక & డేవ్స్ కిచెన్, ఇండియన్ ఫ్లేవర్స్, ఇండీఫ్రెష్, హాట్ బ్రెడ్స్, మరియు ఫైర్ ఫ్లై వంటి రెస్టారెంట్స్ (Indian Restaurants) ఫుడ్ స్పాన్సర్స్ గా వ్యవహరించారు.
ఈ కార్యక్రమాన్ని మధుకర్ యార్లగడ్డ, కోటేశ్వరరావు కందిమళ్ల, మహేష్ కొప్పు, సునీల్ దేవరపల్లి, శశి కుమార్ రెడ్డి దగ్గుల, అనీల్ చిమ్మిలి, నందు యార్లగడ్డ, శ్రీనివాసులు రామిశెట్టి, శరత్ పుట్టి, కృష్ణ నాయుడు, నగేష్ దొడ్డాక, శ్రీధర్ సోమవరపు, శేఖర్ కొల్లు, శిరీష కాట్రగడ్డ, బాబీ వేములపల్లి తదితరులు సమన్వయపరిచారు.