Charlotte, North Carolina: రాబోయే రోజుల్లో చేపట్టబోయే సాంసృతిక మరియు సామాజిక సేవా కార్యక్రమాలకు దిశానిర్దేశం చేయడానికి NATS జాతీయ నాయకత్వ బృందం, శనివారం (జూలై 18న) NATS షార్లెట్ (NC) చాప్టర్ బృందంతో ఫలప్రదమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో NATS చైర్మన్ కిషోర్ కంచర్ల, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (BOD) సభ్యులు అజయ్ గోవాడ, ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) వెబ్ సెక్రటరీ కిషోర్ నారె, మరియు ఇండియా లియాషన్ నేషనల్ కోఆర్డినేటర్ అరుణ్ శ్రీరామనేనిలు.. షార్లెట్ బృంద సభ్యులైన సిద్ధార్థ చాగంటి, దీపిక సయ్యపరాజు, లక్ష్మి బిజ్జల, రూప మర్రి, వినీల దోపలపూడి, మరియు సుమ జుజ్జూరులతో భేటీ అయ్యారు.
సమావేశం సందర్భంగా చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla) షార్లెట్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ చాప్టర్ ఇంత చురుకుగా సాగడంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా సభ్యుల అద్భుతమైన శక్తి సామర్థ్యాలను, ఉత్సాహాన్ని మరియు వారి నాయకత్వ పటిమను ఆయన కొనియాడారు.
మే 28-30, 2027 తేదీలలో డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (Dallas Convention Center) లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే NATS జాతీయ మహాసభలు “అమెరికా తెలుగు సంబరాలు” ముహూర్తం ఖరారైన నేపథ్యంలో.. ఈ మహాసభల ప్రణాళిక మరియు నిర్వహణలో కీలకమైన బాధ్యతలను చేపట్టాల్సిందిగా షార్లెట్ బృందాన్ని చైర్మన్ అధికారికంగా ఆహ్వానించారు.
షార్లెట్ పరిసర ప్రాంతాలలో వేగంగా విస్తరిస్తున్న తెలుగు సమాజాన్ని ఏకం చేయడానికి మరియు వారికి అండగా నిలవడానికి మరిన్ని సరికొత్త కార్యక్రమాలను ప్రారంభించాలని స్థానిక చాప్టర్ను జాతీయ బృందం ప్రోత్సహించింది. అలాగే షార్లెట్ బృందానికి (NATS Charlotte Chapter) జాతీయ కమిటీ నుండి అన్ని విధాలా పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది.
నాట్స్ (North America Telugu Society – NATS) జాతీయ జట్టును కలవటం మరియు వారి నుండి లభించిన ప్రశంస NATS చార్లెట్ బృందానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది అని చాప్టర్ కోఆర్డినేటర్ దీపిక సయ్యపురాజు తమ సంతోషాన్ని వెల్లబుచ్చారు.