Connect with us

Literary

TANTEX తెలుగు భాషా సౌరభాలు; మహిళలచే వినూత్న సాహిత్య రూపకం

Published

on

ఆగస్టు నెల 18 వ తేదీ ఆదివారము జరిగిన డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, TANTEX ”నెల నెల తెలుగు వెన్నెల”, తెలుగు సాహిత్య వేదిక 205 వ సాహిత్య సదస్సులో ”తెలుగు భాషా సౌరభాలు – మహిళలచే వినూత్న సాహిత్య రూపకం” అంశంపై ప్రముఖ విద్యావేత్త డాక్టర్ వెలువోలు నాగ రాజ్యలక్ష్మి గారి తోపాటు ఆరుగురు విద్యాసంపన్నులైన మహిళామణులచే కొప్పెల్, టెక్సాస్ (Coppell, Texas) నగరము నందు శ్రీ లెనిన్ వేముల వారి స్వగృహము వేదికగా నిర్వహించబడిన సంగీత సాహిత్య రూపక ప్రదర్శన సదస్సు న భూతొ న భవిష్యత్ అన్నట్లుగా చాలా బాగా జరిగింది.

అనేక మంది సాహిత్య ప్రియులు ప్రత్యక్షంగానూ మరికొంతమంది అంతర్జాలములోను పాల్గొనడం ద్వారా జరిగిన ”నెలనెలా తెలుగు వెన్నెల”, తెలుగు సాహిత్య వేదిక ప్రారంభ సూచికగా ”పరంధామవతి జయతి ….” అంటూ త్యాగరాయకృత కీర్తనను చిరంజీవి సమన్విత రాగయుక్తంగానూ వీనుల విందుగాను పాడి సాహితీ ప్రియులను భక్తి పారవశ్యులను చేసింది. తన మధుర కంఠంతో కార్యక్రమ ప్రారంభాన్ని శోభాయమానం చేసిన చిరంజీవి సమన్విత ను పలువురు సాహితీ ప్రియులు అభినందించడం జరిగింది. టాంటెక్స్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్, కార్యక్రమాల సలహాదారు మరియు సమన్వయ కర్త , శ్రీ దయాకర్ మాడా నేటి సాహితీ సదస్సు (Literary Event) అంతర్జాల ప్రసార ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు.

శ్రీ దయాకర్ మాడ ముఖ్య అతిథులైన మహిళామణులను సాహితీ ప్రియులకు పరిచయం చేయడం జరిగింది. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ వెలువోలు నాగ రాజ్యలక్ష్మి గారు మాట్లాడుతూ భారత్ లో వున్న ఆరుగురు మహిళామణులతో కలిసి రూపొందించిన సాహిత్య ప్రక్రియల రూపాకాన్ని ప్రదర్శించమని శ్రీ దయాకర్ మాడా కోరారని అందుకు మా సహచరులంతా అంగీకరించడం జరిగిందనీ అన్నారు. భాషమ తల్లి కొలువులో శుచిముఖి డాక్టర్ వీ.ఎన్.రాజ్యలక్ష్మి గారు ప్రాచీన కవులు మరియు ఆధునిక కవులు అందించిన రచనలలో ని తెలుగు భాషా మాధుర్యాన్ని గుర్తుచేశారు. సాహిత్య పరిణామ క్రమం లోమన తెలుగు భాషామతల్లి విభిన్న ప్రక్రియ రూపాలను దాల్చి సాహిత్య సంగమం చేరిందని పేర్కొంటూ రూపకాన్ని ప్రారంభించారు.

ద్విపద ప్రక్రియను శ్రీమతి నిడుమోలు కనకదుర్గా రాణి గారితోను, పద్యం ప్రక్రియను డాక్టర్ తాడేపల్లి వీర లక్ష్మి గారి తోను, జానపదం ప్రక్రియను డాక్టర్ చల్లా సీతా మహాలక్ష్మి గారితోను, శతకం ప్రక్రియను డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల మైథిలి గారితోను, వచన మరియు లఘు కవితల ప్రక్రియను డాక్టర్ వేమూరి సత్యవతి గారితోను, గజల్ ప్రక్రియను డాక్టర్ మద్దూరి బాల దుర్గా శ్యామల గారితోను అభినయింప చేసి తన విశేష ప్రతిభాపాటవాలతో ప్రతి ప్రక్రియను లోతైన అధ్యయనం చేస్తూ రూపకాన్ని కొనసాగించారు. వీరితో సమఉజ్జీలుగా, అత్యంత ప్రతిభావంతులైన ఆ ఆరుగురు మహిళామణులు తమకు కేటాయించిన పాత్ర లలో లీనమై ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు అభినయించడం జరిగింది. తమ వాక్చాతుర్యానికి, మేధో సంపత్తికి సంగీత సాహిత్యాలను మేళవించి, పద్యరత్నాలను, జానపద గీతాలను ఇంకా లాలిపాటలను, గజల్ ప్రక్రియను వీనుల విందుగా గానం చేసిన వీరు నేటి రూపకాన్ని రక్తి కట్టించడంలో అద్భుతంగా కృత కృత్యులైనారు.

అంతేగాక కవి వరేణ్యులు శ్రీనాధుడు, నాచన సోమన, మడిసి సింగన, అన్నమయ్య, తాళ్ళపాక చిన్నక్క, మహాకవి గురజాడ, గోన బుద్ధారెడ్డి,పుట్టపర్తి నారాయణాచార్యులు మున్నగు కవుల రచనా వైశిష్ట్యాన్ని వివరిస్తూ తీయనైన తెలుగు పలుకుల మాధుర్యాన్ని సాహితీ ప్రియులకు విజయవంతంగా చవి చూపించ గలిగారు .డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి వ్యాఖ్యానించినట్లు” ఇది నిజంగా సాహితీ షడ్రుచుల సమ్మేళనం ఈ ఏడుగురు మాతా మహులు, మహిళామణులు సాహిత్యము, సంగీతము, రూప కళ అనే ఈ మూడు శాస్త్రాలను కలగలిపిన ఒక ప్రక్రియను రూపకంగా రూపొందించి నేడు అత్యుత్తమంగా ప్రదర్శించ గలిగారు.” అలాగే శ్రీ లెనిన్ వేముల (Lenin Vemula) గారి మాటల్లో వీరు ”భాషామతల్లి సౌందర్యారాధకులు, సాహిత్య ప్రక్రియల ప్రవాహవేగంతో పయనించువారు, సంగీతశాస్త్ర మెళుకువలు నెరిగిన రూపకరచనా నిపుణులు, ప్రదర్శన కళా ప్రతిభా మూర్తులు, విదుషీమణులు, మెరిసే మేలిమి బంగారు తల్లులు.”

శ్రీ గోవర్ధన రావు నిడిగంటి అన్నట్లు ”నేటి రూపకం ప్రదర్శన జరుగుతున్నంత సేపూ సాహితీప్రియులంతా తమను తాము మరచిపోయి తెలుగు సాహిత్య మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా తన్మయత్వం చెందడం” మరో విశేషం. కార్యక్రమం అప్పుడే ముగిసిందా అని పలువురు వాపోవడం, అదేవిషయం వారి మాటల్లో ప్రతి ధ్వనించడం కూడా నేటి విశేషమే. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం,టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు, సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఇంకా డాక్టర్ వైదేహి శశిధర్, డాక్టర్ నిర్మల లక్కరాజు, శ్రీమతి కాశీనాధుని రాధ, శ్రీఅనంత్ మల్లవరపు,శ్రీ లెనిన్ వేముల, శ్రీ దయాకర్ మాడా, శ్రీ లలితానంద ప్రసాద్,శ్రీ రాజశేఖర్, శ్రీ గోవర్ధనరావు నిడిగంటి మొదలైన సాహితీ ప్రియులనేకమంది నేటి ముఖ్య అతిథు లైన ఏడుగురు మహిళా మణులసాహిత్య కళా ప్రతిభాపాటవాల్ని వేనోళ్ళ కొనియాడడం జరిగింది.

ఆ తరువాత ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం (Telugu Association of North Texas – TANTEX) ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు (Satish Bandaru) మరియు సంస్థ సమన్వయ కర్త డాక్టర్ దయాకర్ మాడా (Dayakar Mada), నేటి ముఖ్య అతిథులకు టాంటెక్స్ సంస్థ తరపున సమర్పించిన సన్మాన పత్ర జ్ఞాపిక ను చదివి వినిపించి ఘనంగా సన్మానించడం జరిగింది. సన్మాన గ్రహీతలైన డాక్టర్ వెలువోలు నాగ రాజ్యలక్ష్మి గారి తో పాటు తమ తమ పాత్రలలో జీవించిన ప్రతిఒక్క మహిళామణీ మాట్లాడుతూ మధురమైన తెలుగు భాషా సాహిత్య ప్రక్రియలను ప్రదర్శించిన తమ కృషిని టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు గారు గుర్తించి, నేటి సాహితీ సదస్సులో తమను సన్మానించి ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తరువాత సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి గత 76 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ”మన తెలుగు సిరి సంపదలు” అందరినీ ఆకట్టుకున్నది. కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చెయ్యాలనే శుభ సంకల్పంతో ప్రారంభించిన ధారావాహికశీర్షిక ”మన తెలుగు సిరిసంపదలు”.

చమత్కార గర్భిత పొడుపు పద్యాలు, ప్రహేళికలు, జాతీయాలు, పొడుపు కథలతో సహా దాదాపు యాభై ప్రక్రియల సమాహారమే ఈ శీర్షిక ప్రత్యేకత.నేటి కార్యక్రమంలో శ్లేష అలంకార భూషిత పద ప్రయోగాలతో పాటు, 3 అక్షరాల పద భ్రమకాలు,5 అక్షరాల పదభ్రమకాలు,కొంటె ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులనుండి సమాధానాలను రాబట్టడంలో విజయవంతమైన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి (Dr. Urimindi Narasimha Reddy) వారిని పలువురు ప్రశంసించడం జరిగింది. అనంతరం ప్రముఖ కవయిత్రి డాక్టర్ వైదేహి శశిధర్ గారు ‘ముగ్గరమ్మలు ‘ శీర్షికతో తాను వ్రాసిన కొన్నివిశేషపద కవితలు చదివి వినిపించారు. వాస్తవితకు అద్దం పడుతున్న వారి స్వీయ కవితలు సాహితీ ప్రియుల మనసులను రంజింప చేశాయనడంలో సందేహం లేదు. అనంతరం డాక్టర్ నిర్మల లక్కరాజు గారు తాను వ్రాసిన ”బడ్జెటు””ఎగిరే పక్షి ” ”చందమామ” శీర్షికలతో వ్రాసిన కవితలను అద్భుతంగా చదివి వినిపించారు.కవితలను చదువుతున్నంత సేపూ వారి రచనా కౌశల్యాన్ని వారి హావ భావాలనూచూసి పలువురు వారిని మెచ్చుకోవడం జరిగింది.

టాంటెక్స్ (TANTEX) ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు, సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి, ప్రముఖ సాహితీ విమర్శకులు శ్రీ లెనిన్ వేముల, శ్రీ బి.లలితానంద ప్రసాద్, శ్రీ దయాకర్ మాడా ప్రత్యక్షంగానూ, సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura), శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం (Subrahmanyam Jonnalagadda), ఇంకా డాక్టర్ వైదేహి శశిధర్, డాక్టర్ నిర్మల లక్కరాజు, శ్రీమతి కాశీనాధుని రాధ, శ్రీ అనంత్ మల్లవరపు (Ananth Mallavarapu), శ్రీమతి స్వాతి, శ్రీ సుబ్బు చిట్టా, శ్రీ రాజశేఖర్, శ్రీ గోవర్ధనరావు నిడిగంటి వంటి సాహితీ ప్రియులు అనేకమంది అంతర్జాలంద్వారాను హాజరవడంతో సదస్సువిజయవంతమైంది. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ నేడు ఆతిథ్యమిచ్చిన శ్రీ లెనిన్ వేముల గారికీ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. నేటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు, సమన్వయ కర్త శ్రీ దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు అన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected