ఖతర్ లోని తెలుగు వారంతా తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుపుకున్నారు. దోహా (Doha, Qatar) లోని భారత రాయబారి కార్యాలయం ఆధ్వర్యంలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ (Indian Cultural Center) తెలుగు లిటరేచర్ క్లబ్ మరియు అనుబంధ సంస్థలైన తెలుగు కళా సమితి, తెలంగాణ ప్రజా స మితి, తెలంగాణ జాగృతి మరియు ఆంధ్ర కళా వేదిక ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుకున్నారు.
ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమం తెలుగు సంఘాల (Telugu Associations) ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన మరియు గొప్ప భాషలలో ఒకటైన “తెలుగు” భాషను గౌరవిస్తూ, గొప్ప తెలుగు కవి, వ్యవహారిక భాష శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజునాడు నాలుగు తెలుగు సంస్థలు – శ్రీ హరీష్ రెడ్డి (అధ్యక్షులు – TKS), శ్రీ శ్రీనివాస్ గద్దె (అధ్యక్షులు – TPS), శ్రీమతి నాగ లక్ష్మి (ఉపాధ్యక్షులు – TJQ), శ్రీ విక్రమ్ సుఖవాసి (ఆపద్ధర్మ అధ్యక్షులు – AKV) నాయకత్వంలో ఈ వేడుకను దిగ్విజయముగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలుగు సంస్థల కార్యవర్గ సభ్యులతో పాటు, ఐసీసీ కార్యవర్గ సభ్యులు, తెలుగు (Telugu) భాషాభిమానులు, వర్ధమాన కవులు మరియు తెలుగు పండితులు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో, వివిధ కూరగాయలు మరియు పండ్ల పేర్లను ఉపయోగించి అందమైన తెలుగు కథా కథనాలతో, వేమన పద్యాలు, తెలుగు పొడుపు కథలు/మెదడును చురుకుగా ఉంచే ఆటలతో, ఆశక్తికరమైన సంభాషణలతో తెలుగు భాషలో వారి సృజనాత్మకతను ప్రదర్శించారు.
అంతేకాక, ప్రపంచ వేదికపై వివిధ రంగాలలో తెలుగు ప్రజల విజయాలు మరియు వారి కృషిని గురించి కొనియాడారు. తెలుగు భాష పై నిర్వహించిన క్విజ్ అందరినీ అలరించింది. గిడుగు వెంకట రామమూర్తి (Gidugu Venkata Ramamurthy) గారి కవిత్వాన్ని, ఇంకా వారి గ్రామంలో కొనసాగుతున్న సంస్కృతిని వివరిస్తూ, తాము ఆ గ్రామానికి చెందినవారమని ఒక ప్రేక్షకురాలు గర్వంగా చెప్పినప్పుడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఆనందించారు.
ఈ కార్యక్రమం తెలుగు భాష (Telugu Language) గొప్పదనాన్ని చాటి చెప్పిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అని చెప్పవచ్చు. ఈ కార్యక్రమానికి యువత నుండి అత్యధిక భాగస్వామ్యం లభించడం, మన సంస్కృతి ప్రస్తుత తరానికి వారసత్వంగా అందుతోందని ఆశించటం అతిశయోక్తి కాదనిపించింది. ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం మాతృదేశానికి దూరంగా ఉంటున్న యువత తమ మూలాలను గుర్తించి గౌరవించడం అని తెలియ చేశారు.
ఈ కార్యక్రమం ఐసిసి (Indian Cultural Center) తెలుగు లిటరేచర్ క్లబ్, హెచ్ఆర్, అడ్మిన్ & కాన్సులర్ హెడ్ రాకేష్ వాఘ్ హృదయపూర్వక స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. ఖతార్ (Qatar) లో తెలుగు సమాజం తమ సంస్కృతిని నిరంతరం సజీవంగా ఉంచడంలో చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఐసిసి జనరల్ సెక్రటరీ అబ్రహం కె జోసెఫ్ తన అధ్యక్ష ప్రసంగంలో వివిధ వర్గాలు ఐక్యతను పెంపొందించడంలో భాష ప్రముఖమైన పాత్ర వహిస్తుందని నొక్కి చెప్పారు.
ప్రపంచ స్థాయి కవులు, తత్వవేత్తలు మరియు కళాకారులను తయారుచేసే తెలుగు వారసత్వాన్ని ఆయన ప్రశంసించారు, వారి రచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఐసిసి అనుబంధ విభాగాధిపతి రవీంద్ర ప్రసాద్ మరియు ఐసిసి అంతర్గత కార్యకలాపాల విభాగాధిపతి వెంకప్ప భాగవతుల (Venkappa Bhagavatula) ప్రత్యేక అభినందన ప్రసంగాలు చేశారు.
సాహిత్యంలో మాట్లాడే మాండలికాన్ని ఉపయోగించడం కోసం ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన ప్రముఖ తెలుగు రచయిత మరియు సామాజిక సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి (Gidugu Venkata Ramamurthy) జన్మదినాన్ని స్మరించుకునే తెలుగు భాషా దినోత్సవం యొక్క శాశ్వత వారసత్వాన్ని, తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంపదను ప్రవాసులలోని పిల్లలు మరియు యువతకు అందించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు.
ఈ తెలుగు భాషా దినోత్సవ (Telugu Language Day) కార్యక్రమాన్ని చక్కగా ముందుకు నడిపించిన శ్రీమతి సౌమ్య, శ్రీమతి శిరీష, శ్రీమతి హారిక మరియు శ్రీమతి నాగలక్ష్మి గార్లకు ఐ సి సి (Indian Cultural Center)మరియు నాలుగు తెలుగు సంస్థల (తెలుగు కళా సమితి, తెలంగాణ ప్రజా స మితి, తెలంగాణ జాగృతి, ఆంధ్ర కళా వేదిక) తరపున అభినందనలు తెలియజేశారు.