Visakhapatnam, Andhra Pradesh, March 11: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే విశాఖలోని విభిన్న ప్రతిభావంతుల విద్యాలయం సన్ ప్లవర్ స్కూల్కి NATS రూ. 20 లక్షలను విరాళంగా అందించింది.
సంబరంలో సేవ.. సంబరంతో సేవ అనే నినాదంతో నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను న్యూజెర్సీ (New Jersey) లో ఘనంగా నిర్వహించింది. ఆ సంబరాల వేదికపైనే సేవా కార్యక్రమాలకు కోటి రూపాయలు ఆర్థిక చేయూత అందిస్తున్నామని ఆనాటి సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని (Sreedhar Appasani) ప్రకటించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలను వివిధ సేవా సంస్థలకు అందించారు.
ఇందులో భాగంగానే విభిన్న ప్రతిభావంతులకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్న సన్ ప్లవర్ స్కూల్కి రూ. 20 లక్షలను నాట్స్ అందించింది. ఈ మొత్తాన్ని సన్ ప్లవర్ స్కూలుకి కొత్త బస్సు కోనుగోలుకు వినియోగించనున్నారు. అలాగే ఈ స్కూలు కోసం ఎవల్ట్యూజ్ సంస్థ వ్యవస్థాపకులు, నాట్స్ బోర్డ్ మాజీ డైరక్టర్ శ్రీనివాస్ అరసడ (Srinivas Arasada) 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు.
తెలుగు వారి కోసం నాట్స్ కృషి: నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి
అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) అన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్య, వైద్యం విషయాల్లో తనవంతు సహకారాన్ని అందిస్తుందని వివరించారు. న్యూజెర్సీలో జరిగిన అమెరికా తెలుగు సంబరాల్లో ఇచ్చిన మాట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో సేవా సంస్థలకు చేతనైన చేయూత అందిస్తున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలక్ట్ శ్రీహరి మందాడి (Srihari Mandadi) తెలిపారు.
భాషే రమ్యం సేవే గమ్యం అనేది నాట్స్ నినాదమని.. దానికి తగ్గట్టుగానే నాట్స్ అటు అమెరికాలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) తెలిపారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకే ప్రవాసాంధ్రులు నాట్స్తో కలిసి పనిచేస్తున్నారని.. వారి సహకారంతో నాట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు.
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే అమెరికా తెలుగు సంబరాల అసలు పరమార్థం కూడా సేవే అని నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda) అన్నారు. టాంపా (Tampa, Florida) వేదికగా జులై 4,5,6 తేదీల్లో జరిగే నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలను ఈ సారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ (North America Telugu Society – NATS) బోర్డు మాజీ ఈసీ సభ్యులు, శ్రీనివాస్ బొల్లు, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది (Srinivas Malladi) తదితరులు పాల్గొన్నారు.