St. Louis, Missouri: తెలుగు వారి మేలు కోసం అమెరికాలో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) తాజాగా మిస్సోరిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. సెయింట్ లూయిస్లోని మహాత్మా గాంధీ సెంటర్లో జరిగిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన (Blood Donation) కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.
నాట్స్ అడ్వైజరీ బోర్డ్ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి (Dr. Sudheer Atluri) స్వయంగా రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. రక్తదానం అనంతరం, ఆయన డాక్టర్ ఏజే తో కలిసి వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకుతగిన సలహాలు, చికిత్స అందించారు.
ఈ వైద్య శిబిరంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం (Ramesh Bellam), నాట్స్ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత అడ్వైజరీ బోర్డ్ సభ్యులు శ్రీనివాస్ మంచికలపూడి,మిస్సోరి చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర లు స్వయంగా రక్తదానం చేశారు. ఈ వైద్య శిబిరం, రక్తదాన కార్యక్రమాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఇంకా వీరితో పాటు నాట్స్ మిస్సోరి చాప్టర్ (NATS Missouri Chapter) కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర్ల, నాట్స్ నాయకులు నాగ శ్రీనివాస్ శిస్ట్లా, నవీన్ కొమ్మినేని,మధుసూదన్ దడ్డాల తదితరులు ఈ వైద్య శిబిరంలో తమ విలువైన సేవలు అందించారు. చాలా మంది స్వచ్ఛంద సేవకులు ఉత్సాహంగా పాల్గొని ఈ శిబిరంలో రక్తదానం చేశారు.
తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారితో పాటు, స్థానిక సమాజానికి మేలు చేకూరాలనే ఉద్దేశంతో నాట్స్ (NATS) ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం చేపడుతోందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. సమాజ హితం కోరి రక్తదానం చేసిన దాతలను, వైద్య సేవలు అందించిన వైద్యులను నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
మిస్సోరీలో నాట్స్ (North America Telugu Society – NATS) ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన నాట్స్ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla), నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి (Srihari Mandadi) అభినందించారు.