Connect with us

Schools

Eluru, Andhra Pradesh: వట్లూరు ప్రభుత్వ పాఠశాలలో అసెంబ్లీ హాల్ నిర్మించిన NATS

Published

on

Vatluru, Eluru District, June 2, 2025: తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) తాజాగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తుంది. తాజాగా ఏలూరు సమీపంలోని వట్లూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అసెంబ్లీ హాల్, డైనింగ్ హాల్‌ను నాట్స్ నిర్మించి ఇచ్చింది.

400 మంది విద్యార్ధులు చదువుకునే ఈ పాఠశాలలో విద్యార్ధుల కోసం నాట్స్ ఈ నిర్మాణాలను చేసింది. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar), రాధా కుమారి దూళిపాళ్ల ఈ నూతన భవనాలను ప్రారంభించారు. నాట్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ ధూళిపాళ్ల ఈ నిర్మాణాలకు రూ. 2 లక్షలు విరాళంగా ఇచ్చారు.

అలాగే డాక్టర్ నాగుబడి సుబ్బారావు ఆర్థిక సహకారంతో నాట్స్ సంస్థ మరో 2 లక్షల రూపాయలు ఈ నిర్మాణాలకు సాయం చేసింది. జన్మభూమి రుణం కొంతైనా తీర్చుకోవాలనే ఆశయంలో నాట్స్ (NATS) మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, విద్యా ప్రమాణాల పెంపు కోసం కృషి చేస్తున్నారు.

ఇప్పటికే ఈ పాఠశాలో కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని కూడా నాట్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి సిబ్బందికి కూడా జీతాన్ని భాను ప్రకాశ్ ధూళిపాళ్ల (Bhanu Prakash Dhulipalla) ఇవ్వడాన్ని వట్లూరు గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.

భాను ప్రకాశ్ ధూళిపాళ్ల ను స్ఫూర్తిగా తీసుకుని ప్రవాసాంధ్రులు తమ ఊరి బాగుకోసం ముందుకు రావాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) పిలుపునిచ్చారు. భాను ప్రకాశ్ సొంత ఊరు కోసం చేస్తున్న కృషిని అభినందించారు. విద్యార్ధులు తమ పాఠశాలలో పెరుగుతున్న వసతులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ మాజీ అధ్యక్షులు మదన్ పాములపాటి, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి, నాట్స్ నాయకులు రాజేశ్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, మురళీకృష్ణ మేడిచెర్ల, కిరణ్ మందాడి, రవి కిరణ్ తుమ్మల, రవి తాండ్ర, కిషోర్ నారే తదితరులకు భాను ప్రకాశ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected