Edison, New Jersey, August 6, 2024: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS తాజాగా అంధ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు సేవా దృక్పథంతో ముందుడుగు వేసింది. బెంగుళూరు (Bangalore) కు చెందిన సమర్థనం ట్రస్ట్, క్యాబీ ఆధ్వరంలో భారత అంధ (Blind) క్రికెటర్లు అమెరికాలో పర్యటిస్తున్నారు.
అంధుల క్రికెట్ పై అవగాహన కల్పించడంతో పాటు 2028 పారా ఒలింపిక్స్లో భారత (India) అంధుల క్రికెట్ జట్టుకు కావాల్సిన ఆర్థిక సహకారం అందించేందుకు అమెరికా (United States of America) లో ఫండ్ రైజింగ్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. భారతీయ అంధ క్రికెటర్లు నిర్వహించే ఈ మ్యాచ్లకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) పూర్తి మద్దతును అందిస్తుంది.
భారత అంధ క్రికెటర్లకు న్యూజెర్సీ (Edison, New Jersey) లో విందు ఏర్పాటు చేసిన నాట్స్ వారిని ప్రోత్సహించేందుకు ఎప్పుడూ నాట్స్ ముందుంటుందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి (Srihari Mandadi) భరోసా ఇచ్చారు. మూడు కేటగిరీలుగా ఉన్న అంధుల క్రికెట్ జట్టును మెంటర్ ధీరజ్ నాట్స్ (NATS) సభ్యులకు పరిచయం చేశారు.
పూర్తిగా అంధులైన బీ1, రెండు అడుగుల వరకు చూడగలిగే వారు బీ2, ఆరు అడుగుల వరకు చూడగలెగే వారు బీ3 జట్టుగా ఉంటారని తెలిపారు. ఈ మూడు గ్రూపుల వారీగానే క్రికెట్ టోర్నమెంట్లు (Cricket Tournaments) జరుగుతాయని వివరించారు. ఈ అంధుల క్రికెటర్లలో ఎక్కువ మంది తెలుగు, గుజరాతీ వారు కావడం గమనార్హం.
గతంలో అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన తెలుగు వ్యక్తి అజయ్ రెడ్డి (Ajay Reddy) తో సహా విజయవాడ, వైజాగ్, కర్నాటక, ఒడిస్సా, ఢిల్లీ, గుజరాత్లకు చెందిన అనేక మంది ఈ అంధుల క్రికెట్ జట్టులో ఆడుతున్నారు. అంధుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఈ క్రికెట్ మ్యాచ్లు (Cricket Matches) ఎంతగానో దోహదపడతాయని నాట్స్ పేర్కొంది.
అంధ క్రికెటర్లకు తమ వంతు చేయూత అందించేందుకు నాట్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్ విమెన్ అరుణ గంటి (Aruna Ganti) అన్నారు. అమెరికాలో భారత అంధ క్రికెటర్ల పర్యటనకు ప్రతి నగరంలో నాట్స్ మద్దతు ఇస్తుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) తెలిపారు. అంధ క్రికెటర్లు ఫండ్ రైజింగ్ కోసం ఆడే మ్యాచ్లకు నాట్స్ తన వంతు సహకారం అందిస్తుందని నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati) భరోసా ఇచ్చారు.
నాట్స్ (North America Telugu Society) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి తోపాటు ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, మోహన్ కుమార్ వెనిగళ్ల, ప్రసాద్ టేకి, వెంకటేష్ కోడూరి తదితరులు పాల్గొన్నారు.