Washington, D.C.: అమెరికా రాజధాని వేదికగా స్వర్ణోత్సవ సంస్థ బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) వాలీబాల్ టోర్నమెంట్ (Volleyball Tournament) ను నిర్వహించింది.. పలు జట్లు, వందలాది మంది యువ క్రీడాకారులు పోటీపడగా రోజంతా సందడి చేశారు, క్రీడా స్ఫూర్తిని సమున్నతంగా చాటారు.
GWTCS అధ్యక్షులు రవి అడుసుమిల్లి (Ravi Adusumilli) మాట్లాడుతూ.. ముఖ్యంగా భారతీయ యువతకు అమెరికాలో వాలీబాల్ పట్ల ఆసక్తి,ఆదరణ గమనించి, అన్ని తరాల క్రీడాకారులను, మహిళా క్రీడాకారులను ఒకే వేదికపై నిలిపి పూర్తి స్థాయిలో ఈ పోటీలు నిర్వహించామని, నిర్వహణకు సహకరించిన దాతలు, కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
పలు విభాగాలలో గెలిచిన విజేత జట్టుకూ, రన్నర్ జట్టుకూ ట్రోఫీలు, మెడల్స్ (Medals) అందించారు. ఉదయం 9:00 గంటల నుండే మొదలైనా ఈ పోటీలు యువత ఉత్సాహం, కేరింతలతో స్టేడియం దద్దరిల్లింది. తమ వారికి ప్రోత్సహిస్తూ వందలాది మంది చుట్టూ చేరి అరుపులు, కేరింతలతో క్రీడాకారులను ఉత్సాహ పరిచారు.
ఉదయం అల్పాహారంతో హాజరైన వందలాది మందికి భోజనం, స్నాక్స్ అందించారు. క్రీడలు (Sports) మానవ పురోగతిలో అంతర్భాగమని, మనిషి వ్యక్తిత్వ వికాసంతో కూడిన సమయస్ఫూర్తి నేర్పిస్తాయని కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. చిన్నారులు, క్రీడాకారులు, వారి కుటుంబ సభ్యులు, సంస్థ కార్యవర్గ సభ్యులు..
అందరూ మ్యాచ్ ఆసాంతం వీక్షిస్తూ క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ సందడి చేసారు. క్రీడా స్ఫూర్తి తో ఆడటం, గెలుపోటములను సమానంగా, ఒక అనుభవంగా స్వీకరిస్తూ.. జీవితంలో సైతం ముందుకు సాగాలని.. ఐదు దశాబ్దాల నుండి భాష, కళ, సంస్కృతిని ప్రతిబింబించే సమున్నత వేదికగా..
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam – GWTCS) నిలిచిందని, ఈ పరంపరను దాతలు, శ్రేయోభిలాషుల సమిష్టి సహకారంతో ఇక ముందూ కొనసాగిస్తామని అధ్యక్షులు రవి అడుసుమిల్లి అన్నారు.. స్థానిక తానా (TANA), ఆటా (ATA) కార్యవర్గ సభ్యులు పాల్గొని విజేతలను అభినందించారు.