Published
2 minutes agoon
By
Sri NexusDallas, Texas: తానా (TANA) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆటా (ATA), డాటా (DATA), డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ (NATS), టాన్ టెక్స్ (TANTEX), టిపాడ్ సంస్థల సహకారంతో ఆదివారం డాలస్ (Dallas) లో జరిగిన “తెలుగు సాహిత్యంలో కవితా వైభవం: డా. గోరటి వెంకన్న (Gorati Venkanna) మాట – పాట” సాహితీసభ క్రిక్కిరిసిన సాహిత్యాభిమానులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. తానా (TANA) పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) ముఖ్యఅతిథి డా. గోరటి వెంకన్న (Gorati Venkanna) ను సభకు పరిచయంచేస్తూ “వెంకన్నకు పెద్దలంటే వినయం, గురువులంటే గౌరవభావం, చిరునవ్వు, అమాయకత్వం, ఆవేశం, భావుకత, సృజనాత్మకతల కలబోతల విద్యావేత్త, సాహితీవేత్త, నిత్యవిద్యార్ధి, నిత్యాన్వేషకుడు, గ్రామీణ కవి, సామాజిక చైతన్య కవి, భావోద్వేగ కవి, ప్రజాకవి, వాగ్గేయకారుడు, సినీ గీత రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, కళాకారుడు, శాసనమండలి సభ్యుడైన డా. గోరటి ఒక సంచలనకవి, సంచారకవి అన్నారు.
రాజకీయనాయకులు చేసేది ‘పాదయాత్ర’ అయితే, గోరటిలాంటి గాయకులు చేసేది ‘పదయాత్ర’ అన్నారు. వెంకన్న (Venkanna) తన పదయాత్రలో ఎన్నో కొత్త పదాలు సృష్టిస్తూ, సామాన్య జనులకు అర్ధమయ్యే సాహిత్యం, ప్రజల నాలుకలమీద సజీవమై కలకాలం నిలిచే పాటలు వ్రాయడంలోను, పాడడంలోను దిట్ట అన్నారు. పల్లె ప్రజలు, మొక్క, చెట్టు, పుట్ట, పిట్ట, వాగు, వంక, గాలి, నీరు, అడవి, పశువు, ప్రకృతి, పక్షి, పనిముట్లు అన్నింటినీ ఆవాహన చేసుకుని కవిత్వం వ్రాయగల స్రష్ట, “గోరటి గోరంత అక్షరంతో కొండంత అర్ధం చూపించగల ద్రష్ట, గోరటి పాటల్లో అసలు సిసలైన మట్టి పరిమళాలు గుభాళిస్తాయి అంటూ అందరి హర్షధ్వానాల మధ్య డా. గోరటి వెంకన్న(Dr. Gorati Venkanna) ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు.
డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) సంచాలకత్వంలో రెండున్నర గంటలకు పైగా సాగిన కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న ముందుగా “పల్లె కన్నీరు పెడుతుందో” అనే పాటను చాలా హృద్యంగా గానం చేశారు. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “1995లో “కుబుసం” సినిమాలో వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన పాట మూతబడ్డ చేతివృత్తులు, పాటుబడ్డ పల్లెలు, ఆధునిక జీవన విధానం, విదేశీ కంపెనీల స్వైర విహారంతో కుదేలవుతున్న గ్రామసీమల నేపధ్యంలో గోరటి వ్రాసిన ఈ పాట ఆయనకు ఎనలేని పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిందని, ఆంగ్లంలోకి అనువదించబడి, ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురణలలో స్థానం పొందిందని అంతేగాక ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) లో బి.ఏ విద్యార్ధులకు పాఠ్యాంశంగా కూడా చేర్చబడిందని” అన్నారు.
1998లో “శ్రీ రాములయ్య” సినిమా కోసం వ్రాసిన “నను గన్న నా తల్లి, రాయలసీమ రతనాల సీమ” అనే బహుళ ప్రజాదరణ పొందిన పాటను అద్భుతంగా గోరటి గానం చేశారు. డా. తోటకూర మాట్లాడుతూ (Dr. Prasad Thotakura) “రాయలసీమలో గనులు, ఘనులు ఎక్కువే. అందుకే తనువెల్ల తరగని గనులు అన్నారు. ఇది కలహాలు, కొట్లాటలు, బాంబులు విసురుకునే ప్రాంతం కాదు – కలియుగ వైకుంఠం తిరుపతి, కాళహస్తి, శ్రీశైలం లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎందఱో బైరాగులు, సాధువులు కొలువైఉన్న ప్రాంతం అంటూ రాయలసీమ వైభవాన్ని ఈ పాటలో గోరటి కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్నారు.
డా. గోరటి “ఓ పుల్లా, ఓ పుడకా, ఎండు గడ్డీ, సెట్టు కొమ్మా” అనే పాట పాడే ముందు, దీనికి స్ఫూర్తి తాను తిరుమలగిరికి రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు, రైలు కిటికిలోంచి ఒక పక్షిని పరీక్షగా చూసినప్పుడు మెరిసిన పాట యిది అంటూ అద్భుతంగా గానం చేశారు. ప్రసాద్ మాట్లుడుతూ – ఈ పాటలో ‘అన్నీ ఉన్నాయి, అన్నీ తెలుసు అనుకునే నరుడు చివరకు ఏమీ లేని, ఏమీ తెలియని చిలకముందు నేలమీద కూర్చుని జ్యోతిష్యం చెప్పమంటాడు’ అనే ముక్తాయింపు అమోఘం అన్నారు.
గోరటి గానం చేసిన “సంతా, మా ఊరి సంతా” పాటకు ప్రేక్షకుల హర్షద్వానాలు మిన్నంటాయి. “వారానికొకసారి జోరుగా సాగే సంత అంటే ఊరంతా పండుగే, సరదాలు, సరసాలు, అల్లర్లు, అరుపులు, కేకలు, అమ్మకాలు, కొనుగోళ్ళు, లాభాలు, నష్టాలు ఇలా గ్రామీణ జీవన వైచిత్రిని ఒక చిత్రకారుడు కుంచెతో ఒక అద్భుతమైన చిత్రాన్ని సృస్టించిన రీతిలో ఈ పాటను గోరటి లిఖించారు” అన్నారు డా. తోటకూర
“గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది” అనే పాటలో పేదల నిస్సహాయ స్థితిని వర్ణిస్తూ హృదయాలను కదిలించేటట్లు గోరటి గానం చేశారు. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) మాట్లాడుతూ “గల్లీ చిన్నది” అంటే చాలామంది గల్లీలో ఉన్న పోరి గురించి వ్రాశారు అనుకుంటారు గాని గల్లీ చిన్నది అంటే ఇరుకైన చిన్న సందు అని అర్ధం అన్నారు. ఇది హృదయ విదారకమైన పాట, కాని దాని అర్ధం తెలుసుకోకుండా పబ్బుల్లో చిందులేస్తూ ఉత్సాహంగా పాడుకోవడ విచారకరం అన్నారు వెంకన్న.
గోరటి పాడిన పాటలలో “నా పల్లె అందాలు సూచితే కను విందురో” పాటలో పల్లె జీవనాన్ని చక్కగా వర్ణించారు. “అద్దాల అంగడి మాయ” – పెట్టుబడి దారి వ్యవస్థ పల్లెల మీద దాడి చేసి ఎన్ని అవస్థల పాలు చేస్తుందో చక్కగా వర్ణించారు. “వాగు ఎండిపాయెరో” అనే పాట ‘కరువు’ కు నిలువెత్తు ప్రతీకగా కనబడుతుంది. పంచ భూతములలో నీరు అత్యంత ముఖ్యమైనది. ఇసుక మాఫియాలు ఇసుక తోడివేయడంతో,సాగు నీటి కొరత, తాగు నీటి కొరత, చాకలి, మత్స్యకార వృత్తుల వారు పడే బాధలు హృదయాన్ని కలచివేస్తాయి.
“తెల్లారిపోతుంది హరిదాస! మూట ఎందుకు వెంట హరిదాసా? దాంట్ల మురికి కూడుతదంట హరిదాసా! మోసుకొచ్చిందెంత హరిదాసా? నీవు తీసుకెళ్లేదెంత హరిదాసా? అనే తత్వగీతం అందరి అభిమానాన్ని చూరగొంది. “ఓటేడ నేనేస్తిరన్నా?”; “పూసిన పున్నమి వెన్నెలమీద తెలంగాణ వీణ”; “నగరం నిద్రబోతున్న వేళ” సినిమాకు గాను వ్రాసిన అత్యంత ప్రజాదరణ పొందిన సమరసింహా దొరబాబు అనే పాట; “నీ ఆట ఏమాయెరో, నీ పాట ఏమాయెరో” లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు డా. గోరటి వెంకన్న (Dr. Gorati Venkanna).
డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) ముగింపు వాక్యాలు పలుకుతూ “గోరటిజీవితంలో ఉద్యమాలు సృష్టించిన పాటలు కొన్నైతే, గోరటి పాటలే సృష్టంచిన ఉద్యమాలు మరిన్ని అన్నారు. పల్లెను, ప్రకృతిని ప్రాణంగా ప్రేమించే వెంకన్న నీటి అలలతో పల్లె అందాన్ని చూసి మురిసిపోతాడు, నీరు లేని గ్రామాలను చూసి తల్లడిల్లిపోతాడు. ‘రేలపూతలు’, ‘పూసిన పున్నమి’, ‘అలసెంద్ర వంక’, ‘వల్లంకి తాళం’ సంకలనాల్లో మొత్తం 120 కవితలుంటే వాటిలో దాదాపు 30 వరకు నీరు, నీటి వనరుల ప్రాముఖ్యత మీద వ్రాసినవే కనిపిస్తాయి. దీనినిబట్టే పాటలల్లో వెంకన్న నీటికి ఎంత పెద్దపీట వేశారో తెలుస్తుంది” అన్నారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఉత్తరాధ్యక్షులు సతీష్ రెడ్డి (Satish Reddy), డాలస్ ఏరియా తెలంగాణా సంఘం (DATA) తరపున రఘువీర్ మర్రిపెద్ది (Raghuveer Marripeddi), డాలస్ తెలుగు అలయ్ బలయ్ సంఘం (డి-టాబ్స్) అధ్యక్షులు రాజ్ ఆనందేషి (Raj Anandeshi), గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) జాతీయ ఉపాధ్యక్షులు ప్రవీణ్ బిల్లా (Praveen Billa), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) పూర్వాధ్యక్షులు బాపు నూతి (Bapu Nuthi), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (TANTEX) అధ్యక్షులు చంద్ర పొట్టిపాటి (Chandra Pottipati) మరియు తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD) సంస్థ వ్యవస్థాపక సభ్యులు, ఫౌండర్స్ కమిటీ ఛైర్మన్ రావు కల్వాల (Rao Kalwala) మొదలైన వారు వారి వారి సంఘసభ్యులతో కలసి డా. గోరటి (Dr. Gorati) ని పుష్పగుచ్చాలతో సన్మానించారు. అలాగే మన తెలుగు రాష్ట్రాలనుండి డాలస్ (Dallas) పర్యటనలో ఉన్న ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి, ప్రముఖ రంగస్థల నటులు, ప్రయోక్త, రచయిత ఆచార్య డా. కందిమళ్ళ సాంబశివరావు (Dr. Kandimalla Sambasiva Rao), తేజస్వి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాకర్, పార్వతీపురం నాయుడు గార్లు డా. గోరటి (Dr. Gorati) ని ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ కార్యక్రమ సంచాలకులు, తానా (TANA) ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) గోరటి వెంకన్న సతీమణి అనసూయ, కుమార్తె తేజస్విని, అల్లుడు ‘రే’ లను వేదికపైకి ఆహ్వానించి అందరి తరపున డా. గోరటి వెంకన్నకుమనకాలపు మహాకవి” అనే బిరుదును ప్రదానంచేసి సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. డా. గోరటి వెంకన్న స్పందిస్తూ “ప్రసాద్ తోటకూర గారి సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, నేను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ గారిదేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి.
ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి అందరితో సన్మానంచేయించి “మనకాలపు మహాకవి” అనే బిరుదును ప్రదానంచేసిన చిరకాల మాన్యమిత్రులు డా. ప్రసాద్ తోటకూర గారికి, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చి ఆసాంతం శ్రద్ధగా విన్న సాహిత్యాభిలాషులకు వందనాలర్పిస్తూ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న రోజు కన్నా, ఈ రోజు నా జీవితంలో ఒక మరపురాని మధురమైన రోజు” అంటూ అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం మొత్తాన్ని వీడియో రూపంలోనూ, ఫోటోల రూపంలోనూ చిత్రీకరించిన శ్రీకుమార్, శిరీష గోమటం దంపతులను డా. గోరటి వెంకన్న సన్మానిం, కృతజ్ఞతలు తెలియజేశారు.