అమెరికా తెలుగు సంఘం (ATA) లో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. గత మూడు ఎన్నికల నుంచి ఈ జాడ్యం మరీ ఎక్కువైంది. ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లి ఒక్కో వర్గం వారు, వారి సొంత ఎగ్జిక్యూటివ్ కమిటీ (Executive Committee) ని ఏర్పాటు చేసుకుని, మేం కరెక్ట్ అంటే మేం కరెక్ట్ అంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.
ఇక వివరాలలోకి వెళితే.. 2025-28 కాలానికి ఆటా (American Telugu Association – ATA) ఎన్నికలు గత డిసెంబర్ లో ముగిసి, ఆ గెలిచిన వారిలోనుంచి జనవరిలో లాస్ వేగాస్ (Las Vegas) లో జరిగిన ఆఫీషియల్ బోర్డు మీటింగ్ లో ఎప్పటిలానే ఎగ్జిక్యూటివ్ కమిటీ ని ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఒక వర్గం వారు బాయ్ కట్ చేసినప్పటికీ ఆటా రాజ్యాంగం (ATA Bylaws) ప్రకారం ఇదే వాలిడ్ మీటింగ్ అన్నారు మరో వర్గం.
ముందు ఎన్నికల ఫలితాలపై, తర్వాత ఆ బోర్డు మీటింగ్ ని ఆపాలని, అనంతరం ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికపై.. ఇలా పలు విషయాలపై కోర్టు కెళ్ళినట్లు తెలిసింది. మధ్యలో కొన్నాళ్ళు రాజీ పడాలని సమాలోచనలు కూడా జరిగినట్లు వినికిడి. ఇంతలో సడెన్ గా గత వారాంతం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే (International Women’s Day) రోజు రెండవ వర్గం వారు మరో మీటింగ్ పెట్టి తమ సొంత ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించారు.
దీంతో ఒకే పదవీ కాలానికి రెండు ఎగ్జిక్యూటివ్ కమిటీలు ప్రకటించడంతో విస్తు పోవడం ఆటా మెంబర్స్ (ATA Members) వంతైంది. ఇదంతా పవర్ గ్రాబింగ్ యాక్ట్ అని, కోర్టులో చెల్లదని వ్యతిరేక వర్గం వారు అంటున్నారు. లాస్ వేగాస్ లో జరిగిన బోర్డు మీటింగే అధికారిక మీటింగ్ అని అంటున్నారు. నెక్స్ట్ మంత్ లో కోర్ట్ హియరింగ్ ఉందని, అప్పటి వరకు ఆగకుండా ఆటా సంస్థ కి చెడ్డ పేరు తెచ్చే చర్యలు హేయమని అంటున్నారు.
ముందు ముందు ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందేనేమో. కోర్టులు, వర్గ రాజకీయాలు, ఈగోస్ కొంచెం పక్కనపెట్టి, ఆటా (American Telugu Association – ATA) బైలాస్ ప్రకారం ఏది కరెక్టో అది చేసి సంస్థ పరువు నిలబెట్టాల్సిందిగా కోరుతున్నారు ఆటా మెంబర్స్.