Washington DC: రాజధాని మెట్రో ప్రాంతం వేదికగా, తెలుగు భాష, కళ, సంస్కృతీ వారసత్వ పరంపరను కొనసాగిస్తున్న స్వర్ణోత్సవ సంస్థ బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam – GWTCS).. ఈ సంవత్సరం దీపావళి సంబరాలను సుమారు 1500 మంది ప్రవాస భారతీయుల మధ్య కోలాహలంగా నిర్వహించారు.
ప్రముఖ గాయని శ్రీమతి సునీత (Singer Sunitha) గారితో వర్ణం బ్యాండ్ వారు ‘సువర్ణ’ భరితంగా, స్వర రంజితంగా అందించిన విభావరి యువతను, చిన్నారులను ఉర్రూతలూగించింది. శ్రీమతి సాయికాంత గారి దీపావళి (Diwali) ప్రత్యేక గీతం మహిళలు, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంది. సంస్థ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్నినిర్విఘ్నంగా సమన్వయపరచారు.
సాయంత్రం 4:00 గంటలనుండే మొదలైన ఈ వేడుకలలో… పండుగ దుస్తులలో చిన్నారులు, మనదైన చీరకట్టుతో మహిళలు విచ్చేసి సందడి చేశారు.. విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభమై, చిన్నారుల సంప్రదాయ నృత్య, కళాభినయంతో కొనసాగిన ఈ కార్యక్రమం అర్ధ రాత్రి వరకూ అతిధులు,
మరియు సంగీత తార తోరణంతో ఆనాటి ఆపాట మధురాలను ఆలకిస్తూ, యువత ఉత్సాహ కేరింకేతాల మధ్య..పసందైన తెలుగింటి భోజనంతో సుమారు రాత్రి 1:00 గంటల వరకూ కోలాహలంగా సాగింది. అధ్యక్షులు రవి అడుసుమిల్లి (Ravi Adusumilli) మాట్లాడుతూ.. 51 ఏళ్ళ క్రితం తెలుగు వారిని ఏకం చేసే వేదిక కోసం..
ఆనాడు కొందరు పెద్దల ఔదార్యం, సహకారంతో మొదలైన ఈ సంస్థకు వెన్నుదన్నుగా నిలిచిన దాతలకు, పెద్దలకు, సంస్థ శ్రేయోభిలాషులకు, పూర్వ అధ్యక్షులకు ప్రత్యేక కృతఙ్ఞతలు అని తెలిపారు. సభికులందరికి దసరా (Dasara), దీపావళి (Diwali) శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కార్యవర్గాన్ని పలువురు ప్రశంసించారు.
మూడు దశాబ్దాలుగా తెలుగు వారిని అలరిస్తున్న గాయని శ్రీమతి సునీత గారిని సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులతో పాటు, ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, తానా (TANA), ఆటా (ATA) స్థానిక ప్రాంతీయ ప్రతినిధులు పాల్గొన్నారు.