Connect with us

People

సాయిసుధ పాలడుగు అధ్యక్షతన ఎన్నారై విమెన్ ఫర్ టీడీపీ ఆధ్వర్యంలో NTR వర్థంతి: Washington DC

Published

on

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) రాజధాని వాషింగ్జన్ డీసీ నగరంలో ఎన్నారై విమెన్ ఫర్ టీడీపీ (NRI Women 4 TDP) వింగ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమం జనవరి 18 సాయంత్రం ఘనంగా నిర్వహించారు. జీడబ్ల్యూటీసీఎస్ మాజీ అధ్యక్షురాలు, ఎన్నారై తెలుగు మహిళ ప్రాంతీయ సమన్వయకర్త సాయిసుధ పాలడుగు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా మద్దతుదారులు, అభిమానులు పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సాయిసుధ మాట్లాడుతూ.. “సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను పోగొట్టి పురుషులతో పాటు అన్నిరంగాల్లో సమానంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. నా తెలుగింటి ఆడపడుచులంటూ ఎంతో వాత్సల్యాన్ని చూపేవారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి మహిళలకు రాజ్యాధికారం కట్టబెట్టారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పారు.

తెలుగుజాతికి ఆత్మగౌరవం ఎన్టీఆర్ ఇస్తే, ఆత్మవిశ్వాసం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఎన్టీఆర్ భావావేశాన్ని, భావజాలాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. యూఎస్ లో మహిళలు ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పనిఒత్తిడి ఉన్నప్పటికీ పార్టీ కోసం సమయం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీలో మహిళల భాగస్వామ్యం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ద్వారానే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అర్పించినవారం అవుతాము” అని అన్నారు.

రిటైర్డ్ ప్రిన్సిపల్ షకీరా బేగం మాట్లాడుతూ.. “మహిళలు ఉన్నత విద్య అభ్యసించేందుకు పద్మావతి యూనివర్సిటీని ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) ఏర్పాటుచేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. అక్షరసేద్యంతో తెలుగుభాషను సుసంపన్నం చేశారు. మాతృభాషలోని మాధుర్యాన్ని తెలుగు ప్రపంచానికి రుచిచూపించారు. అక్షరాన్ని ఆయుధంగా మలచి సాహితీజగత్తును శాసించారు” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో Washington DC పరిసర ప్రాంతాల నుంచి అనిత మన్నవ, శ్రీలత నార్ల, పద్మజ బెవర, తనూజ యలమంచలి, శిరీష నర్రా, అపర్ణ వీరమాచినేని, కరిష్మ కొంగర, శాంతి పరిముపల్లి, ప్రణీత కంతు, శ్వేత కావూరి, వల్లి కుర్రే, పద్మ కోడె, మల్లి నన్నపనేని, రాధి కొట్నూరు, సుష్మ అమృతలూరి, దుర్గ చలసాని, కార్జల్ అచలసాని, స్వప్న, స్వర్ణ కమల్, రోహిత తన్నీరు, రమాదేవి మన్నవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected