Connect with us

Politics

వాషింగ్టన్ డీసీలో ‘ఇదేం ఖర్మ ఆంధ్రప్రదేశ్ కి’ కార్యక్రమం, జగన్ పాలన వల్ల భవిష్యత్ అగమ్యగోచరం: రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి, TDP

Published

on

రాక్షసులకు, రాబందులకు ప్రతిరూపం జగన్ రెడ్డి అని రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. వాషింగ్టన్ డీసీలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా “ఇదేం ఖర్మ ఆంధ్రప్రదేశ్ కి” కార్యక్రమాన్ని అమెరికాలో కూడా చేపట్టాలని పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బకాసురుడు రూపంలో భూదోపిడీకి తెరతీశారు. జగన్ రెడ్డి పాలన చూసి విదేశాల్లో నవ్వుకుంటున్నారు. తెలుగువారంటే దేశంలోనే కాదు అమెరికాలో కూడా గౌరవం ఉంది. జగన్ పాలన వలన భవిష్యత్ అగమ్యగోచరంగా మారి ప్రపంచవ్యాప్తంగా పరువుపోవడం ఖర్మ కాక మరేమిటి అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారు. ఇక రేపటి నుంచి ప్రైవేటు ఆస్తులను దోచుకుంటారని అన్నారు. ప్రవాసాంధ్రులు అప్రమత్తం కాకపోతే రాష్ట్రంలో ఇక ఏమీ మిగలందన్నారు. అవినీతి, అసమర్థతతో ఆస్తులను తెగనమ్మేవాడు ముఖ్యమంత్రి కావడం ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని అన్నారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. జగన్ రెడ్డి సభలకు బలవంతంగా తీసుకువచ్చిన ప్రజలు ఊకదంపుడు ఉపన్యాసాలు వినలేక ఇదేం ఖర్మ అంటూ బారికేడ్లు దూకి పారిపోతున్నారు. రాబోయే ఎన్నికలు ప్రజల భవిష్యత్ కు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలకమైన అంశం. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మినహా మరోదారి లేదు. జగన్ రెడ్డి అధికారంలో కొనసాగినంత కాలం రాష్ట్రం బాగుపడే అవకాశం కనిపించడం లేదు. జగన్ రెడ్డి తన కల్తీ మద్యం వ్యాపారాన్ని ఏపీ నుంచి ఢిల్లీకి విస్తరింపజేశారన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కుటుంబ సమేతంగా ఇరుక్కుని తెలుగువారి పరువు తీయడం రాష్ట్రానికి పట్టిన ఖర్మ అని అన్నారు.

సతీష్ వేమన మాట్లాడుతూ.. ప్రజలు తమకు తాత్కాలికంగా వచ్చే లబ్ధి గురించి ఆలోచించడం కంటే తమ బిడ్డల దీర్ఘకాలిక భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే, పాలన చేతగాక ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని ప్రజలు విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాను మాగులూరి, కిషోర్ కంచర్ల, యాష్ బొద్దులూరి, రమేష్ అవిరినేని, నాగ్ నెల్లూరి, సిద్ధార్థ బోయపాటి, నాగశంకర్ దేవినేని, రాజశేఖర్ బోయపాటి, ఇరువూరి జనార్థన్, శివప్రసాద్ వాగల్లు, శరత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected